
మంటల్లో షోలాపూర్ ఎక్స్ప్రెస్
సాక్షి, ముంబై : షోలాపూర్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వే యార్డులో నిలిపివున్న రైలులోని ఓ బోగి నుంచి పెద్ద ఎత్తున పొగ బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
హుటాహుటిన యార్డుకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో ఫైర్ మెన్స్ మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. రైలులో అగ్నిప్రమాదం జరిగిందన్న వార్త దావనంలా వ్యాపించడంతో ఘటనాస్థలికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.