మోదీ ప్రజల ప్రధానే..! | Sakshi
Sakshi News home page

మోదీ ప్రజల ప్రధానే..!

Published Fri, May 26 2017 2:07 AM

మోదీ ప్రజల ప్రధానే..! - Sakshi

అసంతృప్తి ఉన్నా తరగని మోదీ వన్నె: సర్వేల్లో వెల్లడి
మోదీ సర్కారు ఎన్నికల హామీల అమలు విషయంలో వెనుకబడినప్పటికీ.. ప్రజామోదం విషయంలో ముందంజలోనే ఉందన్నది ఇటీవల వివిధ జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారనేది అంచనా వేసేందుకు చేసిన ఈ సర్వేలు.. ఒకవైపు తాము కోరుకున్న ఫలితాల కోసం నిరీక్షణతో ప్రజల్లో అసహనం పెరుగుతున్నప్పటికీ.. మోదీ మీద ప్రజాభిమానం తరగలేదని చెప్తున్నాయి.

ఆయన ప్రజల మనసులకు దూరం కాలేదని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై దాదాపు 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఎకానమిక్ టైమ్స్ పత్రిక సర్వేలో.. మోదీ పనితీరు ఆశించినదానికన్నా బాగుందని సుమారు 45 శాతం మంది హర్షం వ్యక్తం చేస్తే, దాదాపు 40 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు.

ధరల పెరుగుదల: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని లోకల్ సర్కిల్స్ సర్వేలో 66 శాతం మంది బదులిచ్చారు. అయితే.. జీవన వ్యయాన్ని తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎకానమిక్ టైమ్స్ సర్వేలో 58 శాతం మంది పేర్కన్నారు.

శాంతి భద్రతలు: ఇక శాంతిభద్రతలు, మహిళలపై నేరాల పెరుగుదల విషయంలో జనంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నేరాల రేటు తగ్గలేదని లోకల్‌సర్కిల్స్‌సర్వేలో దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడడం లేదని గత ఏడాది అసంతృప్తి వ్యక్తంచేసిన వారి సంఖ్య 38 శాతం మాత్రమే. అలాగే.. ఎకానమిక్‌టైమ్స్‌తాజా సర్వేలో ‘మహిళలు, పిల్లలపై నేరాలు తగ్గాయని భావిస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘లేద’ని సమాధానం ఇచ్చిన వారు 60 శాతం మంది ఉన్నారు. ఇక అసహనం పెరుగుతుందన్న ప్రశ్నలకు.. అత్యధికులు అటువంటిదేమీ తమకు కనిపించలేదని జవాబు ఇచ్చారు.

ఉపాధి కల్పన: మోదీ సర్కారుకు అతి తక్కువ మార్కులు వచ్చింది ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయంలోనే. లోకల్‌సర్కిల్స్‌సర్వేలో 63 శాతం మంది ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గత ఏడాది 43 శాతంగా మాత్రమే ఉంది. ఎకానమిక్‌టైమ్స్‌సర్వేలోనూ నిరుద్యోగిత తగ్గలేదని ప్రజాభిప్రాయం బలంగా వ్యక్తమైంది.

పెద్ద నోట్ల రద్దు: దేశ ప్రజలను రోజుల తరబడి బ్యాంకుల ముందు క్యూల్లో నిల్చోబెట్టిన పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతిని అరికట్టే విషయంలో ఒరిగిందేమీ లేదని లోకల్‌సర్కిల్స్‌సర్వేలో 49 శాతం మంది అభిప్రాయపడితే.. ఈ చర్య సరైన దిశలో చేపట్టినదేనని 51 శాతం మంది సమర్థించారు.  

జీఎస్‌టీ: మోదీ సర్కారు అతి త్వరలో అమలులోకి తెస్తున్న వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల తమ వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలపై సానుకూల ప్రభావం ఉంటుందని ఎకానమిక్‌టైమ్స్‌సర్వేలో 60 శాతం మంది ఆశాభావం వ్యక్తంచేశారు.

(మరిన్ని వివరాలకు చదవండి)
(
ఇండియా ఫస్ట్‌)
(
కొంచెం మోదం! కొంచెం ఖేదం!!)
(
మోదీ మ్యానియా)
(
57 విదేశీ పర్యటనలు)

 సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌

Advertisement
Advertisement