మెట్రోలో కౌగిలించుకున్నారని.. జంటపై దౌర్జన్యం

couple beaten up by mob for hugging in a metro - Sakshi

కోల్‌కతా : దేశంలో మోరల్‌ పోలీసింగ్‌ పేరిట జంటలపై దాడులు కొత్త కాదు. యువతీయువకులు సన్నిహితంగా కనిపించారనే కారణంతో.. దాడి చేసే మూకలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా కోల్‌కతా మెట్రో రైల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. సోమవారం రాత్రి ఓ జంట కోల్‌కతా మెట్రోలో ప్రయాణించింది. ఈ సందర్భంగా వారు కౌగిలించుకున్నారంటూ.. తోటి ప్రయాణికుల్లోని ఓ మూక దాడికి దిగింది. దమ్‌దమ్‌ మెట్రో స్టేషన్‌లో ఆ జంట దిగిన తర్వాత వారితో కొందరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఎందుకు కౌగిలించుకున్నారంటూ వారు నిలదీయడం.. మాటా-మాటా పెరిగిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.

దీంతో ఆగ్రహానికి లోనైన మూక జంటపై దాడి చేసి.. వారిని చితకబాదింది. ప్రత్యక్ష సాక్షిని ఉటంకిస్తూ ఈ షాకింగ్‌ ఘటన గురించి ఆనందబజార్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. స్వేచ్ఛాయుత వాతావరణం, భద్రతకు పేరొందిన కోల్‌కతా నగరంలో ఇలాంటి ఘటన జరగడం తనను షాక్‌కు గురిచేసిందని, కేవలం మెట్రోలో కౌగిలించుకున్నారని జంటపై మూక దాడికి దిగడం బాధించిందని, ఈ నగరం కూడా భద్రమైనది కాదనే భావన కలిగించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top