
పద్ధతిగా ఉంటే నో గాసిప్స్
సినిమాలో పద్ధతిగా ఉంటే వదంతులు రావు అంటున్నారు నటి తమన్నా. ఈ మిల్కీబ్యూటీకి రీఎంట్రీతో దశ, దిశను మార్చిన చిత్రం
సినిమాలో పద్ధతిగా ఉంటే వదంతులు రావు అంటున్నారు నటి తమన్నా. ఈ మిల్కీబ్యూటీకి రీఎంట్రీతో దశ, దిశను మార్చిన చిత్రం బాహుబలి అని చెప్పక తప్పదు. ముఖ్యంగా కోలీవుడ్లో వరుసగా విజయాలు వరిస్తుండడం విశేషం. ఇక్కడ తోళా, ధర్మదురై, దేవి చిత్రాల విజయాలు తమన్నా స్థాయిని బాగా పెంచాయని చెప్పవచ్చు.కాగా త్వరలో విశాల్తో రొమాన్స్ చేసిన కత్తిసండై తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో గ్లామర్ విషయంలో రెచ్చిపోయారంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
ముఖ్యంగా యువళ గీతాల్లో తమన్నా అందాలు యువతను గిలిగింతలు పెట్టడం ఖాయం. ప్రస్తుతం శింబుకు జంటగా అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈ భామ వదంతుల గురించి చాలానే చెప్పుకొచ్చారు. ఆ సంగతులేమిటో చూద్దాం.
‘నటీనటుల జీవితం ఇతరుల కంటే వ్యత్యాసమైనది. వారి ప్రవర్తన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. నటీనటుల నడవడిక, వారు ధరించే దుస్తులు, భావనలను సాధారణ ప్రజలు అనుసరించాలనుకుంటారు.అందుకే తారల గురించి అధికంగా గాసిప్స్ ప్రచారం అవుతుంటాయి. అలాంటి వదంతులతో కొందరు నటీమణులు మనస్తాపానికి గురవుతున్నారు. వాళ్లకు కుటుంబం ఉంటుంది కదా, వాళ్లు ఏమనుకుంటారోనన్న ఆవేదన పడుతుంటారు. వదంతులనే సంస్కృతి నానాటికీ అధికం అవుతోంది. అయితే కొందరు నటీమణులు వందతులను పట్టించుకోవడం లేదు.అయితే ఇలాంటి వదంతులను మంచి నటనతో గెలవవచ్చునన్నది నా భావన. ప్రతిభావంతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవచ్చు. ఉత్తమ నటి అన్న పేరే చివరి వరకూ మనతో వస్తుంది.అప్పుడే వదంతులను మరచిపోతారు. అంతే కాదు సినిమాలో పద్ధతిగా నడుచుకోవడం చాలా ముఖ్యం. వృత్తిలో అంకిత భావం ఉంటే వదంతుల గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారిపై వదంతులూ అంతగా రావు. నా వరకూ మంచి కథా పాత్రలు అమరుతున్నాయి. పాత్రల ఎంపికపై ప్రతేక దృష్టి పెడుతున్నాను. బాహుబలి చిత్రంలో నా పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. వరసగా మంచి కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నాను’ అని తమన్నా పేర్కొన్నారు.