నాగ్‌-సుమంత్‌.. అసలు గొడవేంటీ..? | Sakshi
Sakshi News home page

నాగ్‌-సుమంత్‌.. అసలు గొడవేంటీ..?

Published Mon, Dec 11 2017 3:00 PM

Sumanth Clears the Rumours with Nagarjuna  - Sakshi

టాలీవుడ్‌ అగ్రహీరో కింగ్‌ నాగర్జునకు, తన మేనల్లుడైన హీరో సుమంత్‌లకు మధ్య విభేదాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది. ఏఎన్నార్‌ మరణాంతరం ఆస్తుల పంపకం దగ్గర ఇద్దరి మధ్య తేడా వచ్చిందని రకరకాల రూమర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఈ ఇద్దరు హీరోలు ఇంతవరకు స్పందించలేదు. అయితే తన కొత్త సినిమా ‘మళ్ళీ రావా’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక వీడియో ఇంటర్వ్యూలో సుమంత్ ఈ విషయమై స్పందించాడు.

తనకు తన మావయ్యకు విభేదాలున్నాయన్న మాట అవాస్తవమని సుమంత్ అన్నాడు. అసలు బయట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నట్లు కూడా తనకు తెలియదని సుమంత్ అన్నాడు. తాను తన మావయ్యతో రోజూ మాట్లాడతానని.. తరచుగా కలుస్తుంటానని చెప్పాడు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కలవడం కొంచెం తగ్గిందని చెప్పాడు. మేమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పుకొచ్చిన సుమంత్‌.. అఖిల్.. చైతూ.. రానా.. ఇలా తన ఫ్యామిలీ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉందని.. వీరితో కలిసి సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానన్నాడు.

తాను క్యారెక్టర్.. విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని సుమంత్ చెప్పాడు. ‘మనం’ సినిమాకు నంది అవార్డు రాకపోవడంపై వివాదం చెలరేగడం గురించి స్పందిస్తూ.. ఇలాంటివి మామూలే అని.. హాలీవుడ్లో ఎందరో గొప్ప దర్శకులకు ఆస్కార్ అవార్డులు రాలేదని.. కొందరికి లేటుగా వచ్చాయని.. కాబట్టి ఈ వివాదం గురించి తాను కామెంట్ చేయనని.. తమ సినిమాకు ప్రేక్షకులు అద్భుతమైన విజయాన్నందించారని.. అది చాలని సుమంత్ అన్నాడు. 

ఇక ప్రేమకథ సినమాతో సుమంత్‌ను హీరోగా నాగర్జున పరిచియం చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా సుమంత్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారిన సమయంలోనూ ‘సత్యం’  సినిమాను నిర్మించి అతన్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు.  

Advertisement
Advertisement