మిస్‌ యూ పప్పా: హీరో భావోద్వేగం | Riteish Deshmukh Emotional Video On Father Birth Anniversary | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే పప్పా: జెనీలియా, రితేశ్‌ భావోద్వేగం

May 26 2020 5:18 PM | Updated on May 26 2020 5:54 PM

Riteish Deshmukh Emotional Video On Father Birth Anniversary - Sakshi

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. మిమ్మల్ని రోజూ మిస్సవుతున్నా!!’’ అంటూ బాలీవుడ్‌ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తన తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ జయంతి సందర్భంగా భావోద్వేగ వీడియోను షేర్‌ చేశాడు. హ్యాంగర్‌కు తగిలించి ఉన్న తండ్రి కుర్తా స్లీవ్‌లో తన చేతిని ఉంచిన రితేశ్‌.. దానిని ఆలింగనం చేసుకుని ఆ చేతితో తన తలను తానే  నిమురుకున్నాడు. తండ్రే స్వయంగా దిగివచ్చి తనను ఆత్మీయంగా హత్తుకున్నట్టు ఉద్వేగానికి లోనయ్యాడు. మిస్‌ యూ నాన్నా అంటూ ట్విటర్‌ వేదికగా నివాళి అర్పించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించిన టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌.. ‘ఎంత అందమైన వీడియో’అంటూ రితేశ్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశాడు. అతడితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.(ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి ఇంట్లో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్)

కాగా రితేశ్‌ భార్య, నటి జెనీలియా సైతం మామగారిని గుర్తు చేసుకుంటూ.. ‘‘నువ్వు గర్వపడే విషయం ఏమిటని టీచర్‌ రియాన్‌ను అడిగినపుడు.. వాడి సమాధానం.. మా తాతయ్య అని. ఎల్లప్పుడూ మేం మీ సమక్షంలోనే ఉన్నట్లు భావిస్తాం. మీరెక్కడున్నా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారని తెలుసు. మా అందరిలో మీరు జీవించే ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే పప్పా’’అని భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. కాగా 1945 మే 26న జన్మించిన విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌.. మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 2012లో కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. విలాస్‌రావ్‌ నలుగురు కుమారుల్లో రితేశ్‌ సినీరంగంలో ఉండగా.. మిగిలిన వారు రాజకీయాల్లో ప్రవేశించి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.(‘గ్లామర్‌ వాలా, సఫాయీ వాలా ఒకటే’)

Advertisement
 
Advertisement
Advertisement