ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ ఫ్రం హోమ్‌! | Facebook And Google May Extend Work From Till Year End | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ ఫ్రం హోమ్‌!

May 8 2020 2:29 PM | Updated on May 8 2020 2:48 PM

Facebook And Google May Extend Work From Till Year End - Sakshi

వాషిం‍గ్టన్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనమంతా స్థంభించడంతో పాటు ఆర్థిక కార్యాకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాలు బయటపెడితే కరోనా ఏ పక్క నుంచి కాటేస్తుందోనని ప్రతి ఒక్కరూ బయపడుతున్నారు. ఓ వైపు కరోనా మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు తమ రోజూవారి కార్యాకలపాలను కొనసాగించేందుకు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. కేవలం భారత్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే వైరస్‌ నుంచి కొంత కుదుటపడ్డ దేశాలు ఇప్పుడే లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు జంకుతున్నాయి.  మరి కొన్నాళ్ల పాటు  ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌  కీలక నిర్ణయం తీసుకుంది. (జియో మరో భారీ డీల్ )

క‌రోనా నేప‌థ్యంలో ఇప్పటికే వ‌ర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చిన ఫేస్‌బుక్ సంస్థ‌.. దానిని ఈ ఏడాది (2020) చివ‌రి వ‌ర‌కు పొడిగించ‌డానికి ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక ప్రముఖ సెర్చ్‌‌ ఇంజన్‌ గూగుల్‌ కూడా ఇదే బాటలో పయనించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఉద్యోగుల అందరికీ వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇస్తారా లేక 50 శాతం ఉద్యోగులకు మాత్రమే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. వీటితో పాటు చాలా వరకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు సైతం వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్దతిని మరికొనాళ్లపాటు కొనసాగించాలని చూస్తున్నాయి. (నిమిషానికి 5 వేల ప్రకటనలు తొలగించాం)

ఇక దేశంలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబై, ఢిల్లీలోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పిరిస్థితుల్లో ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులతో పాటు ఆయా సంస్థల యాజమాన్యాలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో వర్క్‌ ఫ్రం హోం ఉత్తమం‌ అని వైద్య అధికారులతో పాటు ప్రముఖుల సైతం భావిస్తున్నారు. కాగా కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనుంది. అయితే ఇక పూర్తిగా ఎత్తివేస్తారా.. ? లేక మరోసారి పొడిగస్తారా అనేది తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement