కరోనా నుంచి రక్షణకు అదొక్కటే మార్గం

బీజింగ్: ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారి బారిన పడి కకావికలమవుతున్నాయి. ఎప్పుడూ ప్రపంచం చూడనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి ఎటువంటి మందు కానీ, వాక్సిన్ కానీ కనిపెట్టలేదు. ఈ వైరస్ను ఎదుర్కోవాలంటే తరచు చేతులు కడుక్కోవడం, మాస్క్లు ధరించడం, ఇంటిని, పరిసరాలను క్రిములు వ్యాప్తిచెందకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటి స్వీయ రక్షణ చర్యలు మాత్రమే మార్గాలు. అయితే హాంకాంగ్ యూనివర్శిటి వాళ్లు కరోనా వైరస్ పై జరిపిన రీసెర్చ్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
కరోనా వైరస్ స్టెయిన్లెస్ స్టీల్, ప్లాస్టిక్ ఉపరితలాలపై 4రోజుల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా కరోనా నుంచి రక్షణ కోసం ఉపయోగించే మాస్క్లపై మాత్రం కరోనా వైరస్ వారం రోజుల పాటు ఉంటుందని హాంకాంగ్ యూనివర్శిటి పరిశోధకులు తెలిపారు. మాస్క్ ముందు భాగాన్ని చేతితో తాకితే ఆ వైరస్ చేతికి అంటుకొని దాని ద్వారా ముఖాన్ని, కళ్లను, ముక్కును తాకినప్పుడు మనం వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే చేతులు కడుక్కున్న తరువాతే ముఖాన్ని కానీ, కళ్లను కానీ ముట్టుకోవాలని సూచిస్తున్నారు. (కరోనాకు విరుగుడు అదేనా?)
గది ఉష్ణోగ్రత వద్ద ఏఏ వస్తువులపై కరోనా వైరస్ ఎంత సేపు ఉంటుందని పరిశోధనలు చేశారు. దీనిలో భాగంగా ప్రింటింగ్ పేపర్, టిష్యూ పేపర్ల మీద కరోనా వైరస్ కేవలం మూడు గంటలు మాత్రమే ఉంటుందని కనుగొన్నారు. చెక్క మీద, బట్టల మీద రెండో రోజుకు కనిపించకుండా పోతుందని, గ్లాస్ మీద, బ్యాంక్ నోట్ల మీద రెండురోజుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మాస్క్ల మీదే అత్యధికంగా వారం రోజుల పాటు కరోనా వైరస్ ఉంటుందని వారు తెలిపారు. కరోనాను ఎదుర్కొవడానికి తరచు చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఒక్కటే మార్గమని వారు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలకు పైగా కరోనా బారిన పడగా 70 వేల మందికి పైగా మృతి చెందారు. ( వైరస్ బారిన 26 మంది నర్సులు, డాక్టర్లు)
మరిన్ని వార్తలు