భారత్‌–నేపాల్‌–చైనాల మధ్య ఆర్థిక కారిడార్‌

China proposes an India-Nepal-China economic corridor through Himalayas - Sakshi

బీజింగ్‌: హిమాలయ దేశమైన నేపాల్‌పై మరింత పట్టు బిగించేందుకు చైనా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చైనా–నేపాల్‌–భారత్‌ల మధ్య కొత్త ఆర్థిక కారిడార్‌ నిర్మాణాన్ని డ్రాగన్‌ దేశం ప్రతిపాదించింది. నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యావలి చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఈ మేరకు స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో చర్చల అనంతరం కుమార్‌ బుధవారం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేపాల్‌–చైనాలు బహుళార్థక ప్రయోజనాలున్న హిమాలయ అనుసంధాన వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించాయి’ అని చెప్పారు.

అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ స్పందిస్తూ.. నేపాల్‌ ఇప్పటికే వన్‌బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిందన్నారు. ఇందులో భాగంగా నేపాల్‌లో రైలు, రోడ్డు మార్గాలు, విమానాశ్రయాలు, విద్యుత్, సమాచారం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. దీనివల్ల చైనా–నేపాల్‌–భారత్‌లను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్‌ను నిర్మించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. నేపాల్‌ అభివృద్ధికి భారత్, చైనాలు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ధర్మశాలలో ఉన్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలుసుకునేందుకు టిబెట్‌ శరణార్థులు తమ దేశం గుండా వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు నేపాల్‌ ఒప్పుకుందన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top