
ఆస్ట్రేలియాలో కొడుకుతో సహా మహిళ మృతి
ఆస్ట్రేలియలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
హైదరాబాద్ : ఆస్ట్రేలియలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెల్బోర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుప్రజ (31) అనే మహిళ తన ఆరునెలల కుమారుడితో పాటు 30 అంతస్తుల బిల్డింగ్పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. మూడు రోజుల క్రితం (మంగళవారం) 20వ ఫ్లోర్ నుంచి సుప్రజ...కొడుకుతో సహా జారి పడింది. మెల్బోర్న్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గంగాధర్కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్కు హైదదాబాద్ శేరిలింగంపల్లికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కూతురు సుప్రజతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఏడాదిన్నర క్రితం శ్రీనివాస్ కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. సుప్రజ గర్భిణిగా ఉండడంతో గతేడాది డిసెంబర్లో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర మెల్బోర్న్ వెళ్లారు. సుప్రజకు ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే ఆర్మూర్కు తిరిగి వచ్చారు. శ్రీనివాస్, సుప్రజలు సైతం ఈ నెలలోనే ఇక్కడకు రావాల్సి ఉంది. ఈలోపే సుప్రజ చనిపోవడం విషాదాన్ని నింపింది.
ఈ సందర్భంగా మృతురాలు సుప్రజ మేనమామ గంగాధర్ మాట్లాడుతూ ... ఘటన జరిగిన సమయంలో శ్రీనివాస్ ఆఫీస్కు వెళ్లాడని, భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవన్నారు. తమ దగ్గర వీసా, పాస్పోర్టు లేకపోవడంతో అక్కడకు వెళ్లలేకపోతున్నామన్నారు. మరోవైపు శ్రీనివాస్ తండ్రి గంగాధర్ గత రాత్రే మెల్బోర్న్ బయల్దేరి వెళ్లారు. మరో రెండురోజుల్లో సుప్రజ మృతదేహాన్ని హైదరాబాద్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.