మన విశ్వనగరం.. ఒక్క గాలివానకు కుదేల్ | heavy rain causes damage in Hyderabad | Sakshi
Sakshi News home page

మన విశ్వనగరం.. ఒక్క గాలివానకు కుదేల్

May 21 2016 4:04 AM | Updated on Sep 4 2018 5:21 PM

మన విశ్వనగరం.. ఒక్క గాలివానకు కుదేల్ - Sakshi

మన విశ్వనగరం.. ఒక్క గాలివానకు కుదేల్

జస్ట్... 1.4 సెంటీమీటర్ల వర్షం... జమిలిగా అరగంటసేపు వీచిన ఈదురుగాలులు... అంతే, ఖేల్‌ఖతమ్.. రెక్కలు విరిగిన పక్షిలా కుదేలైంది మన విశ్వనగరం. వందలాది చెట్లు నేలకూలాయి.

- అరగంట వర్షానికి అతలాకుతలం
- గంటకు 50 నుంచి 100 కి.మీ. వేగంతో వీచిన గాలులు
- నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు
- ముగ్గురు దుర్మరణం.. పలువురికి తీవ్రగాయాలు

 
జస్ట్... 1.4 సెంటీమీటర్ల వర్షం... జమిలిగా అరగంటసేపు వీచిన ఈదురుగాలులు... అంతే, ఖేల్‌ఖతమ్.. రెక్కలు విరిగిన పక్షిలా కుదేలైంది మన విశ్వనగరం. వందలాది చెట్లు నేలకూలాయి. నూటయాభైకి పైగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అనేకచోట్ల పెద్దపెద్ద హోర్డింగులు విరిగిపడ్డాయి. వీటి ధాటికి పార్కు చేసివున్న వందలాది వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. రాత్రంతా అంధకారం. శనివారానికి గానీ కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేమని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.

(చూడండి: హైదరాబాద్ లో భీకర వర్షం ఫొటోలు)


 రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం జడివాన విలయ తాండవం చేసింది. దాదాపు అరగంట పాటు ప్రచండ వేగంతో వీచిన ఈదురుగాలులు, కుండపోత ధాటికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి, వాన కలసి బీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగులు, కూలిపోయాయి. రేకుల షెడ్లు, తాత్కాలిక కట్టడాల పైకప్పులు ఎగిరిపోయాయి. భవనాలపై నీటి ట్యాంకులు ఎగిరిపోయి దూరంగా పడిపోయాయి. వర్షపు నీరు పోటెత్తి పలు కాలనీలు, రహదారులు చెరువుల్లా మారాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి.. ప్రజలు నానా అవస్థలూ పడ్డారు. దాదాపు సగానికిపైగా నగరంలో అంధకారం నెలకొంది. కొన్ని ప్రాంతాలకు శనివారం సాయంత్రానికిగానీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేమని అధికారులు వెల్లడించారు. ఇక గాలివాన ధాటికి ముగ్గురు మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్యుములోనింబస్ మేఘాలే ఈ గాలివానకు కారణమని వాతావరణ కేంద్రం ప్రకటించింది.


హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం గాలివాన హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక తదితర ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఈదురుగాలులు, జడివాన కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్‌పల్లి, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. ఉరుములు, మెరుపులతో ప్రజలు భీతావహులయ్యారు. పాత భవనాల్లో నివాసమున్నవారు భయం భయంగా గడిపారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద భారీ హోర్డింగ్ విరిగిపడడంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి.

క్యుములోనింబస్ మేఘాల ఉధృతి అధికంగా ఉండడంతోనే జడివాన కురిసిందని.. గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయని బేగంపేటలోని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తుపాను ప్రభావం హైదరాబాద్ నగరంపై లేదని పేర్కొంది. రాత్రి 8.30 గంటల వరకు 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. వచ్చే 24 గంటల్లోనూ భారీగా ఈదురుగాలులతో జడివాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

విమానాల రాకపోకలకు అంతరాయం
గాలివాన బీభత్సం కారణంగా శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 7.20 గంటలకు విజయవాడ బయలుదేరాల్సిన ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని రద్దు చేశారు. విజయవాడ నుంచి రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్‌కు రావాల్సిన ఇదే ఎయిర్‌లైన్స్ విమానం రద్దయింది. రాత్రి 9 గంటలకు చెన్నై వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం రాత్రి 11 గంటలకు బయలుదేరింది. మరికొన్ని విమానాల సమయం షెడ్యూల్ కంటే ఆలస్యమైందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

పలు ప్రాంతాల్లో నీటిసరఫరా ఆలస్యం
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్‌లోని పాతబస్తీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, రెడ్‌హిల్స్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాలకు నీటి సరఫరా ఆలస్యమవుతుందని జలమండలి వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తున్న పంపింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదని, స్థానిక పంపింగ్ కేంద్రాలకే సరఫరా నిలిచిపోయిందని వెల్లడించింది.

గాలుల ధాటికి ముగ్గురు మృతి
ఈదురు గాలుల ఉధృతికి టోలిచౌకీ ప్రాంతంలో భవనం పైనుంచి కిందపడిపోయి ఒక వ్యక్తి మత్యువాత పడ్డాడు. అత్తాపూర్ మారుతీనగర్‌లో ప్రహరీగోడ కూలి ఎల్లయ్య అనే వ్యక్తి మరణించాడు. రాజు అనే మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఇక పాతబస్తీలోని తలాబ్‌కట్ట జహంగీర్ నగర్‌లో ఈదురుగాలుల తీవ్రతకు ఓ భవనంపై ఉన్న మూడువేల లీటర్ల సింథటిక్ నీటిట్యాంకు ఎగిరి.. భవనం పక్కన కింద ఉన్న అహ్మద్‌బిన్ ఇబ్రహీం అనే వ్యక్తిపై పడింది. దీంతో అతను అక్కడిక్కడే మృత్యువాతపడ్డాడు. ఆయన సోదరుడికి తీవ్రంగా గాయాలయ్యాయి.
 
అంధకారంలో సగం నగరం
ఈదురు గాలుల ధాటికి విద్యుత్ సరఫరా వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. గచ్చిబౌలి, రాజేంద్రనగర్, బాచుపల్లి, బొల్లారం, షాపూర్‌నగర్, ఆనంద్‌నగర్, సనత్‌నగర్, బేగంపేట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అబిడ్స్, నాంపల్లి, కార్వాన్ తదితర ప్రాంతా ల్లో చెట్లకొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి, వైర్లు తెగిపోయాయి. పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. 250 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మరో 500 ఫీడర్ల పరిధిలో 4 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో శనివారం సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉందని సీపీడీసీఎల్ వర్గాలు తెలి పాయి. అత్యవసర సమయంలో విద్యుత్ ఎస్‌ఈ, డీఈ, ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్లి.. పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించాలి. కానీ ఇళ్లలో ఉండిపోయి కిందిస్థాయి సిబ్బందికి ఫోన్లలోనే ఆదేశాలు జారీ చేశా రు. దీంతో సమన్వయం లేక విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరుగుతోంది. మరో వైపు గంటల తరబడి వాహనాలు నిలిచి పోవడంతో గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
 
జడివాన సృష్టించిన బీభత్సమిదీ..

  • ఈదురుగాలులు, జడివానకు దెబ్బతిన్న విద్యుత్ ఫీడర్లు:     250
  • కూలిన విద్యుత్ స్తంభాలు:    150
  • దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు: 6
  • కుప్పకూలిన హోర్డింగ్‌లు: 125
  • కూలిపోయిన చెట్లు: 277 (రహదారులకు అడ్డంగా పడిన 247 చెట్లను తొలగించారు)
  • చెట్లు విరిగిపడడంతో ధ్వంసమైన వాహనాలు: 500కుపైగానే
  • ట్రాఫిక్ స్తంభించిన కూడళ్లు: 100కుపైనే
  • మృత్యువాత పడినవారు: ముగ్గురు (పదుల సంఖ్యలో గాయపడ్డారు)
  • దాదాపు సగానికిపైగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం సాయంత్రానికి సరఫరా పున రుద్ధరించే అవకాశం ఉందని సీపీడీసీఎల్ వర్గాలు తెలిపాయి. విద్యుత్‌శాఖకు రెండుకోట్ల నష్టం వాటిల్లింది.
  • విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శనివారం ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పాతబస్తీ ప్రాంతాలకు శనివారం ఆలస్యంగా నీటిసరఫరా అయ్యే అవకాశం ఉందని జలమండలి తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement