‘బోరు బావుల’పై సర్కారు మార్గదర్శకాలు | Government Guidance on 'Bore wells' | Sakshi
Sakshi News home page

‘బోరు బావుల’పై సర్కారు మార్గదర్శకాలు

Aug 27 2017 3:28 AM | Updated on Sep 2 2018 5:24 PM

‘బోరు బావుల’పై సర్కారు మార్గదర్శకాలు - Sakshi

‘బోరు బావుల’పై సర్కారు మార్గదర్శకాలు

నిరుపయోగ బోరు బావుల వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

బోర్లు వేసే రిగ్‌లకు అనుమతులు తప్పనిసరి చేశాం
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
 
సాక్షి, హైదరాబాద్‌: నిరుపయోగ బోరు బావుల వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. బోర్లు వేసే రిగ్‌లకు అనుమతులను తప్పనిసరి చేశామని తెలిపింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో బోరు బావిలో పడి ఇటీవల ఓ చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో సుప్రీం మార్గదర్శకాలను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించా లంటూ పిల్‌ దాఖలవడం తెలిసిందే. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్‌ దాఖలు చేశారు. వికారాబాద్‌లో చిన్నారిని రక్షించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన బోరు యజమానిపై కేసు నమోదు చేశామని, బోరును మూసేసినా యజమాని అనుమతి లేకుండా తిరిగి తెరిచారన్నారు.  బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారంతోపాటు పిల్లలకు ఉచిత విద్య, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 వేల బావులకు మూతలు బిగించామన్నారు. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధిశాఖ మంత్రి సమీక్ష నిర్వహించి సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ తాజాగా మార్గదర్శకాలను రూపొందించామని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ వ్యాజ్యంపై 30న హైకోర్టు విచారణ జరపనుంది. 
 
ఇవీ మార్గదర్శకాలు...
► డ్రిల్లింగ్‌ ఏజెన్సీలన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
► ప్రతి రిగ్‌ యజమాని లేదా ఆపరేటర్‌ నెలలో భూగర్భ జలశాఖ వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. రెండేళ్లకోసారి దాన్ని పునరుద్ధరించుకోవాలి.
► రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే జరిమానా చెల్లించాలి. జరిమానా చెల్లించాక కూడా రిజిస్టర్‌ చేసుకోకుంటే క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి.
► బోరు తవ్వేందుకు తహసీల్దార్, ఎమ్మార్వో నుంచి అనుమతులున్నాయో లేదో రిగ్‌ యజమాని తెలుసుకోవాలి. అనుమతులు లేకున్నా బోరు తవ్వితే రిగ్‌ యజమానికి రూ. లక్ష జరిమానా. 
► రిగ్‌ యజమాని బోరు తవ్వకం పూర్తయిన తరువాత బోరు తవ్విన విషయాన్ని తవ్విన 3 రోజుల్లోపు తహసీల్దార్‌ లేదా ఎమ్మార్వోకు తెలియచేయాలి.
► బోర్లకు మూతవేయలేదని తెలిస్తే ఎమ్మార్వో యజమానులకు నోటీసిచ్చి మూసివేతకు ఆదేశాలివ్వాలి.
► కలెక్టర్లందరూ క్షేత్రస్థాయి సిబ్బంది సాయంతో నిరుపయోగంగా ఉన్న, ట్యూబ్‌ బావులపై సర్వే చేసి వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌ డేటాబేస్‌లో ఉంచాలి.
► నిరుపయోగంగా ఉన్న, తవ్వి వదిలేసిన బోరు బావుల యజమానులకు ఏడు రోజుల్లో మూసివేతకు నోటీసులివ్వాలి. మూసేయకుంటే రూ. 50 వేల జరిమానాతోపాటు క్రిమినల్‌ కేసు పెట్టాలి.  

Advertisement
 
Advertisement
Advertisement