వచ్చే జూన్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పని చేయాలంటే తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు.
అమరావతి నుంచి పనిచేయాలంటే ఆ సౌకర్యం కల్పించండి
ప్రభుత్వానికి అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల ప్రతిపాదన
రాజధాని నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైలు సదుపాయం కావాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే జూన్ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పని చేయాలంటే తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. నూతన రాజధానిలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా నిర్మాణం కానందున వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలు ఉండేలా చూడాలని కోరారు.
అలా చేస్తే హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో అధికారులు, ఉద్యోగులు అక్కడికి వెళ్లకపోయినా.. తాము ఎక్కువ సమయం పనిచేయడానికి సిద్ధమన్నారు. తమ పిల్లలు హైదరాబాద్లోనే చదువుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగుల కుటుంబాలు నూతన రాజధానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఐదు రోజుల పనిదినాల పద్ధతి అమలు చేస్తే శని, ఆదివారాలు హైదరాబాద్లో తమ కుటుం బంతో గడపవచ్చని వారు యోచిస్తున్నారు.
ఐదు రోజుల పనిదినాలు అమలు చేస్తే.. ప్రతీ సోమవారం హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని, మళ్లీ శుక్రవారం రాజధాని నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తే ఆ రైలులో తాము హైదరాబాద్ వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం సాయంత్రం తొందరగా ఉద్యోగులను వదిలేస్తే మిగతా రోజుల్లో అదనపు గంటలు కూడా పనిచేయవచ్చుననే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా హైదరాబాద్లోనే ఉంటూ రాజధాని వెళ్లి పని చేసే ఉద్యోగులు, అధికారులకు బ్యాచ్లర్ అకామిడేషన్ కల్పిస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాగూ రెండు చోట్ల ఇంటి అద్దె అలవెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి హైదరాబాద్లోనే ప్రభుత్వ క్వార్టర్స్లో మరో ఏడాది పాటు ఉండేందుకు అనుమతించాలని అధికారులు, ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.