పురం.. ఎవరి పరం ?

పురం.. ఎవరి పరం ? - Sakshi


ఒకప్పుడు పరిశ్రమల ఖిల్లాగా, వాణిజ్య కేంద్రంగా భాసిల్లిన హిందూపురం లోక్‌సభ స్థానం ఇప్పుడు బోసిపోయింది. పునర్‌వైభవం సాధించేందుకు సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. ఇది రాజకీయ ముఖచిత్రంలోనూ సమూల మార్పులు సూచిస్తోంది. సాగునీరు అందించి బంజరు భూములను మాగాణులు చేసే... పరిశ్రమలు స్థాపించి చేతినిండా పని కల్పించే నేతకే పట్టం కడతామని ఇక్కడి ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.

 

 ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి - అనంతపురం: హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో సిటింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పవర్‌లూమ్స్ యజమానులకు దన్నుగా నిలిచి సొంత సామాజిక వర్గమైన చేనేతల పొట్టకొట్టిన నిమ్మలపై ప్రజావ్యతిరేకత కన్పిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్ బాటలు వేయడం, ముస్లింలు, చేనేత, ఇతర సామాజిక వర్గాల ప్రజలు బాసటగా నిలుస్తోండటంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి రేసులో ముందున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవడంతో ఆ పార్టీ అభ్యర్థి చిన్న వెంకటరాముడు కనీస ప్రభావం కూడా చూపే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థానం నుంచి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 

 ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ కొనసాగింది. పీఆర్పీ అభ్యర్థి కడపల శ్రీకాంత్‌రెడ్డి లక్షకుపైగా ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఖాసీంఖాన్‌పై టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 22,835 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కడపల శ్రీకాంత్‌రెడ్డి బరిలో లేకుండా ఉంటే నిమ్మల కిష్టప్ప గెలుపొందే వారు కాదని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు.

 

 నిమ్మలపై ప్రజావ్యతిరేకత

 సిటింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పను టీడీపీ మరోసారి బరిలోకి దింపింది. ఐదేళ్లలో ఎంపీగా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలనూ చేపట్టలేకపోయారు. కదిరి-పుట్టపర్తి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపూర్ రైలుమార్గాలను సాధిస్తానని చెప్పి.. చివరకు చేతులెత్తేశారు. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నహామీని నెరవేర్చలేదు. ఎంపీ ల్యాడ్స్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. హిందూపురం మండలం ముద్దిరెడ్డిపల్లిలో బినామీ పేర్లతో పవర్‌లూమ్స్ నిర్వహిస్తున్నారని చేనేత వర్గం నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

 

 దీనివల్ల ధర్మవరం, సోమందేపల్లి, హిందూపురం పరిసర ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. ఐదేళ్లలో హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని 58 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.  ఏ ఒక్క కుటుంబాన్నీ నిమ్మల పరామర్శించిన దాఖాలాలు లేవు. దీంతో సొంత సామాజికవర్గంలోనే ఆయన పట్ల సానుకూలత లేదు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులు కూడా నిమ్మల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.   చివరకు హిందూపురం నుంచి పోటీచేస్తోన్న నందమూర్తి బాలకృష్ణ కూడా వ్యతిరేకిస్తోండటం గమనార్హం.

 

 అన్ని వర్గాలూ వైఎస్సార్ సీపీ వైపే

 లోక్‌సభ స్థానం పరిధిలో కురుబ, బోయ, చేనేత సామాజిక వర్గాల ప్రజలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కురుబలకు చోటిస్తామని, జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బోయలకు కేటాయిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆ రెండు సామాజిక వర్గాలూ పార్టీకి దన్నుగా నిలుస్తున్నాయి. చేనేత సంక్షేమం కోసం వైఎస్ అమలు చేసిన పథకాలను కొనసాగిస్తానని వైఎస్ జగన్ ప్రకటించడం ఆ వర్గాలను పార్టీకి చేరువ చేసింది. ముస్లిం మైనార్టీలు ఇప్పటికే వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు.

 

 వారు టీడీపీ-బీజేపీ పొత్తుపై మండిపడుతున్నారు. నియోజకవర్గాన్ని వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో యువ పారిశ్రామికవేత్త దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ బరిలోకి దించింది. ఐదేళ్లలో లక్ష మందికి తగ్గకుండా ఉపాధి కల్పించకపోతే.. 2019 ఎన్నికల్లో పోటీచేయనని శ్రీధర్‌రెడ్డి చేస్తోన్న వాగ్దానంపై జనం సానుకూలంగా స్పందిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేనేతలకు అందుబాటులో తేవడం ద్వారా చేనేతలను ఆదుకుంటానన్న హామీపై కూడా సానుకూలత వ్యక్తమవుతోంది. హంద్రీ-నీవా రెండో దశను పూర్తిచేసి.. 2.34 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని, చెరువులను నింపి సేద్యానికి ఊపిరిపోస్తానని శ్రీధర్‌రెడ్డి హామీ ఇస్తున్నారు.

 

 ఇదీ చరిత్ర

 హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలి సార్వత్రిక ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (కేఎంపీపీ) అభ్యర్థి కేఎస్ రాఘవాచారి కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రావుపై విజయం సాధించారు. 1952, 1962 ఎన్నికల్లో కేవీఆర్ రెడ్డి (కాంగ్రెస్) విజయకేతనం ఎగురవేశారు. 1967లో నీలం సంజీవరెడ్డి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన  కేంద్ర మంత్రివర్గంలోనూ స్థానం దక్కించుకున్నారు. 1971, 1977, 1980లో  పాముదుర్తి బయపరెడ్డి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు.

 

టీడీపీ ఆవిర్భవించాక 1984లో నిర్వహించిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కె.రామచంద్రారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సానిపల్లి గంగాధర్ వరుసగా రెండు సార్లు (1989, 1991) పార్లమెంటుకు వెళ్లారు. 1996 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్.రామచంద్రారెడ్డికి ప్రజలు అవకాశమిచ్చారు. ఆ తర్వాత 1998లో నిర్వహించిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సానిపల్లి గంగాధర్‌ను విజయం వరించింది. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కర్నల్ నిజాముద్దీన్ గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకు విజయం దక్కింది.


హిందూపురం: లోక్‌సభ నియోజకవర్గం

 తొలి ఎంపీ     :    కేఎస్ రాఘవాచారి (కేఎంపీపీ)

 ప్రస్తుత ఎంపీ    :    నిమ్మల కిష్టప్ప (టీడీపీ)   రిజర్వేషన్   : జనరల్

 

 ప్రధాన అభ్యర్థులు వీరే

 దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్ సీపీ)

 నిమ్మల కిష్టప్ప (టీడీపీ)

  చిన్న వెంకట్రాముడు (కాంగ్రెస్)

 హిందూపురం లోక్‌సభ స్థానం  ఓటర్ల సంఖ్య 14,45,742

 మహిళలు 7,11,655

 పురుషులు 7,34,020

 ఇతరులు 67

 

 అసెంబ్లీ సెగ్మెంట్‌లు    

 1. రాప్తాడు

 2. ధర్మవరం

 3. కదిరి

 4. పుట్టపర్తి

 5. పెనుకొండ

 6. మడకశిర

 7. హిందూపురం

 

 నియోజకవర్గ ప్రత్యేకతలు

 -  నియోజకవర్గ కేంద్రమైన హిందూపురం పట్టణం బెంగళూరుకు సమీపంలో ఉండ టంతో పారిశ్రామికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

 - నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లు కర్ణాటకతో సరిహద్దును పంచు కుంటున్నాయి.

 - గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించిన తిమ్మమ్మమర్రిమాను కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉంది.

 - అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి, ప్రసిద్ధిగాంచిన లేపాక్షి ఆలయం  ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉన్నాయి.

 

 అసెంబ్లీ సెగ్మెంట్లు .. బలాబలాలు

 రాప్తాడు

 పాత కాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీత బరిలోకి దిగారు. పరిటాల సునీత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. ఇదే సమయంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా వందలాది బోరు బావులు తవ్వించి ప్రజల దాహార్తి తీర్చారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా రమణారెడ్డి పోటీ చేస్తున్నారు.

 

 ధర్మవరం

 తాజా మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా  బరిలోకి దిగారు. ఆయన నియోజకవర్గాన్ని రూ.850 కోట్లతో అభివృద్ధి చేశారు. దీంతో ప్రజల్లో సానుకూలత ఉంది. టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి ఫ్యాక్షన్ నేపథ్యమున్న నేత కావడంతో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టీడీపీ వర్గ విభేదాలూ ఆయనకు మైనస్. కాంగ్రెస్ అభ్యర్థి రంగన అశ్వర్థనారాయణ చేనేత ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు.

 

 కదిరి

 ఇక్కడ ముస్లింల ఓట్లు అధికం. అత్తార్ చాంద్‌బాష వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా,  తాజా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.  కందికుంట నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీనికితోడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో మైనార్టీలు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరామ్‌నాయక్ బంజారాల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు.

 

 పుట్టపర్తి

 ఇద్దరు విద్యావేత్తల మధ్య పోరు సాగుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి సి.సోమశేఖరరెడ్డి ఐదేళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు.  టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ప్రజాప్రతినిధిగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సామకోటి ఆదినారాయణ ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి కన్పించడం లేదు.

 

 పెనుకొండ

 వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎం.శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి, టీడీపీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేయకపోవడంతో  ప్రజలు కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.  టీడీపీలోని పరిటాల వర్గం రఘువీరాకు  అనుకూలంగా పని చేస్తున్నట్లు విమర్శలున్నాయి.

 

 మడకశిర

 ఏపీసీసీ చీఫ్ రఘువీరా సొంత నియోజకవర్గమైన మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థి కె.సుధాకర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ అభ్యర్థి ఈరన్నకు అసమ్మతి వెంటాడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎం.తిప్పేస్వామికి ఆదరణ కన్పిస్తోంది.  వైఎస్ హయాంలో వక్కలిగ సామాజికవర్గం వారిని బీసీ జాబితాలో చేర్చడం, మడకశిరను అభివృద్ధి చేయడం వైఎస్సార్ సీపీ అభ్యర్థికి లాభిస్తాయని ప్రజలు భావిస్తున్నారు.

 

 హిందూపురం

 టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు పార్టీలో వర్గ విభేదాలు, స్థానికేతర వివాదం, టీడీపీ ఎమ్మెల్యేల పాలనలో అభివృద్ధి జరగకపోవడం వంటివి ప్రతికూలాంశాలుగా మారాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్‌కు మాస్‌లీడర్‌గా పేరుంది. ఇక్కడ ఎక్కువగా ఉన్న మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు  ఆయనకు దన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంహెచ్ ఇనయతుల్లాను మైనార్టీ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి.

 

  జీవనాడి: కూలికెళ్లిన మావాడు.. ఏఈ అయ్యాడు!

 మాది పేద కుటుంబం. కూలీనాలీ చేసి మా కొడుకు కళ్యాణ్‌రెడ్డిని పదో తరగతి వరకు చదివించాం. ఆ తర్వాత అనంతపురం పాలిటెక్నిక్ కాలేజీలో చేర్పించాం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. సుమారు ఏడాది పాటు కూలీ నాలీ చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు.ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో కళ్యాణ్ మళ్లీ కాలేజీకి వెళ్లాడు. పాలిటెక్నిక్, ఆ తర్వాత మదనపల్లి మిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. రీయింబర్స్‌మెంట్ ఉన్నందున ఫీజుల సమస్యే తలెత్తలేదు. చదువు పూ ర్తవగానే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్నాడు.  వైఎస్సే లేకపోతే మా బిడ్డ కూలి పనులకే పరిమితమయ్యే వాడు.’’

 - హేమలత, ఈశ్వరరెడ్డి,

 చిప్పలమడుగు, కదిరి మండలం


 

 ప్రగతి పరిశీలన

 సమాధి రాళ్లు :

 -    ఆత్మకూరులో  జూలై 9, 1999న  హంద్రీ-నీవా పథకం కోసం చంద్ర బాబు పునాదిరాయి వేశారు. శిలాఫలకానికి కుడివైపున మూడు మీటర్ల మేర మాత్రమే కాలువ తవ్వించి..తర్వాత పట్టించుకోలేదు.

 -    ఎగువన కర్ణాటక చేపట్టిన నాగలమడక ప్రాజెక్టును అడ్డుకోక పోవడంతో రామగిరి మండలంలోని పేరూరు డ్యాం ఒట్టిపోయింది.

 -    బాబు నిర్లక్ష్యం వల్ల హిందూపురంలో 26 పరిశ్రమలు మూతపడ్డాయి.

 -    పరగోడు రిజర్వాయర్(కర్ణాటక)ను అడ్డుకోకపోవడంతో చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలో 35 వేల ఎకరాల ఆయకట్టు బీడుపడింది.

 -    తన హయాంలో మంత్రిగా ఉన్న నిమ్మల కిష్టప్ప పవర్‌లూమ్స్‌ను ప్రోత్సహించి...చేనేతల పొట్టగొట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు.

 

అభివృద్ధికి ఆనవాళ్లు

 -    హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.6,850 కోట్లతో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.

 -    హిందూపురం, మడకశిర ప్రాంతాలకు తాగునీటి కోసం రూ.560 కోట్లతో నీలకంఠాపురం శ్రీరామరెడ్డి  పథకాన్ని పూర్తి చేయించారు.

 -    ధర్మవరం, కదిరి మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.170 కోట్లతో పథకాలను చేపట్టారు.

 -    మడకశిర నియోజకవర్గాన్ని రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారు. హార్టికల్చర్, వెటర్నరీ పాలిటెక్నిక్‌లు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయించారు.

 -    హిందూపురం పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక ఐఐఎస్‌సీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్) రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేయించడానికి 2008లో కేంద్రాన్ని ఒప్పించారు. వైఎస్ హఠాన్మరణంతో ఆ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top