ఎన్నికలు వచ్చేసరికల్లా పట్టపగ్గాల్లేకుండా వాగ్దానాలు కురిపించే రాజకీయ పార్టీలకు ఇక బ్రేక్ పడింది. ఎన్నికల ప్రణాళికలో చేసే ఏ వాగ్దానానికైనా పార్టీలు వివరణలివ్వడం తప్పనిసరిచేస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) నిబంధన విధించింది.
సంపాదకీయం: ఎన్నికలు వచ్చేసరికల్లా పట్టపగ్గాల్లేకుండా వాగ్దానాలు కురిపించే రాజకీయ పార్టీలకు ఇక బ్రేక్ పడింది. ఎన్నిక ల ప్రణాళికలో చేసే ఏ వాగ్దానానికైనా పార్టీలు వివరణలివ్వడం తప్పనిసరిచేస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) నిబంధన విధించింది. చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అవసరమయ్యే ఆర్ధిక వనరులూ, వాటి సమీకరణకున్న మార్గాలూ ఇక వివరించి తీరాలని నిర్దేశించింది. ఓటర్లను అనుచితంగా ప్రభావితం చేసే, సమానావకాశాల వాతావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి వాగ్దానాలూ చేయొద్దని కూడా పార్టీలన్నిటికీ సూచించింది. ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇవ్వాలని కూడా తెలిపింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల తీరుతెన్నుల్ని, వాటి బాధ్యతారహిత ప్రవర్తనను గమనించేవారికీ...ఎన్నికల్లో అవి చేస్తున్న వాగ్దానాలను చూసేవారికీ ఇలాంటి నిబంధనలు అత్యవసరమని అనిపిస్తాయి.
అలా చూసి చూసి విసుగెత్తినవారే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో చేసే వాగ్దానాలు చట్టపరంగా అవినీతి చర్యగా పరిగణించడం సాధ్యంకాదని తెలిపింది. అయితే, అన్ని పక్షాలకూ సమానావకాశాలుండేలా, ఎన్నికల ప్రక్రియకుండే స్వచ్ఛత దెబ్బతినకుండా చూసేలా తగిన నిబంధనలను రూపొందించాలని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఈసీని కోరింది. తమిళనాట అన్నా డీఎంకే, డీఎంకే వంటి పార్టీలు పోటీబడి ‘ఉచిత’ వాగ్దానాలు చేయడం...తమకు ఓటేస్తే గ్రైండర్లు, మిక్సీలు, ఫ్యాన్లు, కలర్ టీవీలు, ల్యాప్టాప్లు, పెళ్లికూతుళ్లకు బంగారు తాళిబొట్లు ఇవ్వజూపటం నిజమే. యూపీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్పీ, బీజేపీ, జేడీ(ఎస్) వంటివి చేతికి ఎముకలేకుండా చేసిన వాగ్దానాలు కోకొల్లలు. ఇక క్రికెట్ కిట్లు, పట్టుచీరలు వంటివి ఎన్నికల సమయంలో ఓటర్లకు అందజేయడం సర్వసాధారణంగా మారింది.
అయితే, ఈ సాకుతో అసలు రాజకీయపక్షాలు చేసే వాగ్దానాలపైనే ఆంక్షలు విధించడం, ఆ వాగ్దానాలు నెరవేర్చేది ఎలాగో చెప్పాలనడం అంత సైరె న నిర్ణయం అనిపించుకోదు. ఏవగింపు కలిగేలా, సామాన్య ఓటరును ప్రలోభపెట్టేలా రాజకీయపక్షాలు హామీలు గుప్పిస్తున్న సంగతిని ఎవరూ కాదనలేరుగానీ...అలా వాగ్దానాలు చేసినంత మాత్రానే జనం మెచ్చి ఆయా పార్టీలకు అధికారం అప్పగిస్తారనుకోవడం సరికాదు. సమాజంలోని కొన్ని వర్గాలకు ప్రభుత్వపరంగా ఆసరా అవసరమని భావించినప్పుడు, తాము వస్తే ఫలానావిధంగా చేస్తామని పార్టీలు చెబుతుంటాయి.
ఆ వాగ్దానం ‘హేతుబద్ధం’గా ఉండాలని, వాటికి వనరులు ఎలా సమకూర్చుతారో చెప్పాలని ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్దేశిస్తోంది. అధికారంలోకొస్తే రైతులందరికీ ఉచిత విద్యుత్ అందజేస్తానని 2004 ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వాగ్దానం చేశారు. అప్పట్లో ఈ వాగ్దానంపై కాంగ్రెస్ అధిష్టానానికే స్పష్టతలేదు. స్వయంగా ఆర్ధికవేత్త అయిన ప్రధాని మన్మోహన్సింగ్ అయితే దాని సాధ్యతపై సంశయం వ్యక్తంచేశారు. ఇక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది అసాధ్యమని ప్రచారం చేశారు. ఒకవేళ అలా ఉచిత విద్యుత్ ఇచ్చినా కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప పనికిరావని ఎద్దేవా చేశారు.
కానీ, వైఎస్ అధికారంలోకొస్తూనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. దాన్ని అయిదేళ్లపాటూ జయప్రదంగా అమలుచేయగలిగారు. అందువల్ల తెలంగాణ జిల్లాల్లో పంటల దిగుబడి ఎంతగానో పెరిగింది. కరెంటు చార్జీలను పెంచబోమన్న హామీని కూడా ఆయన నెరవేర్చారు. ఇప్పుడు ఈసీ పెట్టిన నిబంధన ప్రకారం ‘ఉచిత విద్యుత్’ ఎలా సాధ్యమో కూడా ఎన్నికల ప్రణాళిక నిరూపించాల్సి ఉంటుంది. అలాంటి ప్రయత్నం చేసినా దాన్ని పూర్వపక్షం చేయడానికీ...అందులో అహేతుకత ఉన్నదని చెప్పడానికీ ప్రత్యర్థిపక్షాలు ప్రయత్నిస్తాయి. అప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయానికొస్తుంది? ఆ వాగ్దానం నెరవేర్చడానికి పార్టీ చూపిస్తున్న వనరుల సమీకరణ సవ్యంగా లేదని ఈసీ భావించినా, ప్రత్యర్థిపక్షాల వాదనలే సబబని విశ్వసించినా ఆ వాగ్దానం చెల్లదని చెబుతుందా? తొలగించమని సూచిస్తుందా? ఉచిత విద్యుత్ అమలుపై సందేహం వెలిబుచ్చిన మన్మోహనే తర్వాతకాలంలో దాన్ని ప్రశంసించారన్న సంగతిని గుర్తుంచుకుంటే ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకోగల సామర్థ్యం ఈసీ కి ఎంతవరకూ ఉంటుందో అనుమానమే.
సమాజంలోని భిన్నవర్గాల సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు వెదకడం ఒక సృజనాత్మక ప్రక్రియ. సమస్యలను గుర్తించడంలోగానీ, వాటికి పరిష్కారాలను ఆలోచించడంలోగానీ అందరికీ ఒకే రకమైన దృక్పథం ఉండదు. ఎన్టీఆర్ అధికారంలో కొచ్చేవరకూ పేదలకు చౌక ధరకు బియ్యం అందించవచ్చునని ఎవరికీ తోచలేదు. అలాగే ఆరోగ్యశ్రీ, 108 సేవలు, 104 సేవలు, ఫీజు రీయింబర్స్మెంటు వంటివి వైఎస్ వచ్చేవరకూ ఏ పాలకుడూ అమలు చేయలేదు. ఆయా పథకాలవల్ల అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతగానో మేలుకలిగింది.
వాగ్దానాల్లోని సహేతుకతను పోల్చుకోవడంలో, వాటి ఆంతర్యాన్ని పసిగట్టడంలో మన ఓటర్లు ఎవరికీ తీసిపోరు. వారికి ఆ విచక్షణే లేకపోతే, 2009లో కొత్తగా ఒక్క హామీ కూడా ఇవ్వని వైఎస్ కాక...‘ఆల్ ఫ్రీ’ వాగ్దానాలు చేసిన బాబే గెల్చివుండేవారు. కనుక దొంగ వాగ్దానాల భరతంపట్టే పనిని ఓటర్లకు వదిలేయడమే ఉత్తమమని ఈసీ గ్రహిస్తే మంచిది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా జరిగేలా చేయడంలో ఈసీ చాలావరకూ విజయం సాధించింది. కానీ, ఇంకా ఆ దిశగా చేయాల్సింది ఎంతో ఉన్నదని కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవలికాలంలో భారీయెత్తున బయటపడిన దొంగ ఓటర్ల బాగోతం నిరూపించింది. అలాంటి అంశాలపై ఈసీ మరింతగా దృష్టిసారించాలి.