పల్లె పడుచులే లక్ష్యం | Women trafficking gang busted | Sakshi
Sakshi News home page

పల్లె పడుచులే లక్ష్యం

Sep 21 2016 11:01 AM | Updated on Aug 20 2018 4:44 PM

నిన్నా మొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి.

కొలువుల పేరుతో యువతుల తరలింపు
తిరుపతి కేంద్రంగా వ్యాపారం
వ్యభిచార ముఠాల గుప్పిట్లో     చిక్కుకుని విలవిల
బాధిత కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం
తిరుపతి ఏజెంటు రాణిమ్మను అదుపులోకి తీసుకుని విచారణ

 
తిరుపతి : నిన్నా మొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌లనే ఇద్దరు ఏజెంట్లు సుమారు 150 మంది మహిళలను విదేశాలకు పంపారు. సత్యవేడుకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు.

రఫీ, పాండియన్‌లను అరెస్టు చేశారు. కాగా ఈ తరహా మోసాలు, మహిళల అక్రమ తరలింపులు తిరుపతిలోనూ వెలుగు చూశాయి. దీంతో అర్బన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఠాల కోసం గాలిస్తున్నారు.
 
తిరుపతి నుంచి ఇలా... పూతలపట్టు మండలం డీ మిట్టూరుకు చెందిన వెంకట రమణ, తిరుపతికి చెందిన వెటశాల శ్రీనివాసరావు మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తిరుపతికి చెందిన కొందరు మహిళల తరలింపు ఏజెంట్లు తమ తమ భార్యలను ఏ విధంగా విదేశాలకు తీసుకెళ్లారో వివరించి అక్కడి వ్యభిచార కూపాల్లో మహిళలు అనుభవిస్తోన్న నరక యాతనను వివరించారు. వివరాలు వారి మాటల్లోనే....
 
నా భార్యను రక్షించండి...
మాది పూతలపట్టు మండలం డి. మిట్టూరు గ్రామం. కొన్నాళ్లుగా భార్యాపిల్లలతో తిరుపతి మంగళం రోడ్డులో ఉంటున్నాం. పక్కనే ఉన్న రాణిమ్మ పరిచయమైంది. దుబాయ్‌కి వెళితే నెలకు రూ.1 లక్ష సంపాదన ఉంటుందనీ, అక్కడి ఇళ్లల్లో పనిచేస్తే నెలవారీ జీతం వస్తోందని ఆశ చూపింది. ఇందుకోసం ఖర్చవుతుందని చెపితే రూ.50 వేలు చెల్లించాం. ఆగస్టు 12న నా భార్య అమృతతో పాటు మరో 14 మంది మహిళల్ని తీసుకుని రేణిగుంటలో రెలైక్కారు.

మూడ్రోజులు ముంబయి హోటల్లో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత ఎటు నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. 15 రోజుల తర్వాత సౌదీకి తీసుకెళ్తున్నారని ఫోన్‌లో చెప్పింది. తిరిగి ఈ నెల 17న మళ్లీ ఫోన్‌లో మాట్లాడింది. అక్కడ తనను హింసిస్తున్నారనీ, వ్యభిచారం చేస్తేనే ఉంటావనీ, లేకుండా ప్రాణాలతో ఉంచబోమని బెదిరిస్తున్నారని ఏడ్చింది.

ఏం చేయాలో తెలియక ఆదివారం సాయంత్రం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు రాణిమ్మను పట్టుకొచ్చారు. విచారణ చేస్తున్నారు. ఎలాగైనా నా భార్యను రక్షించండి.  పీ వెంకట రమణ, తిరుపతి.
 
విచారణ జరుపుతున్నాం...
మహిళల రవాణా గురించి తెల్సింది. ఎక్కడెక్కడ ఎంత మందిని విదేశాలకు పంపారో గుర్తిస్తున్నాం. అసలు మహిళల్ని ఎలా ట్రాప్ చేశారో, బాధితులు, ముఠా సభ్యుల మధ్య పరిచయాలు ఎలా మొదలయ్యాయే తెల్సుకుంటున్నాం. ఇటీవలనే ఈ తరహా కేసు మరొకటి నమోదైంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాం. ఎవర్నీ వదలం.
  జయలక్ష్మి, అర్బన్ ఎస్పీ, తిరుపతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement