బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
బైక్ అదుపు తప్పి ఒకరు దుర్మరణం
Oct 13 2016 1:08 AM | Updated on Jul 29 2019 6:03 PM
కల్లుదేవకుంట(మంత్రాలయం రూరల్): బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దసరా పండగ సందర్భంగా ఇద్దరు యువకులు బంధువుల ఇంటికి వెళ్తుండగా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసనాయక్ తెలిపిన మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయాచూర్ జిల్లా గిల్కసూగూరు క్యాంప్కు చెందిన బాలమదిరాజు కుమారుడు మహింద్రకుమార్, నెట్టికల్లు కుమారుడు వడ్డె రాము దసరా పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం బంధువుల ఊరైన పత్తికొండ మండలం మారెళ్ల గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మంత్రాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు దగ్గరికి చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో బైక్తో పాటు ఆ ఇద్దరు యువకులు ఎగిరి పక్కనున్న గుంతలో పడ్డారు. ఈ ఘటనలో మహింద్రకుమార్(20) అక్కడిక్కడే మరణించగా వడ్డెరాముకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఈయువకుడిని చిక్సిత నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ పెద్దాసుపత్రికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహింద్రకుమార్ మృతదేహానికి ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అతడి బంధువులకు అప్పగించారు.
Advertisement


