సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే చాలు ‘వామ్మో! చలానా పడుతుందేమో’ అని జేబులు తడుముకునే పరిస్థితికి మల్కాజిగిరి కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టారు. ‘మాకు మీ డబ్బులు వద్దు.. మీ ప్రాణాలు ముఖ్యం’ అంటూ రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్మెట్ బ్యాంక్ కాన్సెప్్టకు శ్రీకారం చుట్టారు. ‘శిర్రస్తాణం తీసుకో.. ప్రాణాలు కాపాడుకో’ కార్యక్రమంతో వాహనదారుల్లో హెల్మెట్ ప్రాధాన్యంపై అవగాహన పెరిగింది.
త్వరలో ప్రతి ఠాణాలోనూ..
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని నివారించేందుకు మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం అల్వాల్, గోపాలపురం, మల్కాజిగిరి, బేగంపేట ప్రాంతాల్లో హెల్మెట్ బ్యాంక్లను ఏర్పాటు చేశారు. త్వరలోనే కమిషనరేట్లోని ప్రతి ఠాణాలో శిర్రస్తాణం కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఉల్లంఘిస్తే భారీ జరిమానా..
ద్విచక్ర వాహనదారులు ఎవరైనా హెల్మెట్ లేకుండా రహదారులపై కనిపిస్తే జరిమానా విధించకుండా వాహనదారుడి పేరు, ఫోన్ నంబరు, బైక్నంబరు వంటి ప్రాథమిక వివరాలు, డాక్యుమెంట్లను తీసుకొని హెల్మెట్ను ఉచితంగా అరువుకు ఇస్తారు. దాన్ని ధరించి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఆ తర్వాత ఆ వాహనదారు సొంత హెల్మెట్ను కొనుగోలు చేసి, అరువు తీసుకున్న హెల్మెట్ను 24 గంటల్లోగా తిరిగి అందజేయాలి. ఒకవేళ హెల్మెట్ తిరిగి ఇవ్వకపోయినా.. లేదా మళ్లీ హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తూ పోలీసులకు చిక్కినా భారీ జరిమానా విధిస్తారు.
12,577 హెల్మెట్లు అందజేత..
ఇప్పటివరకు నాలుగు హెల్మెట్ బ్యాంక్ల ద్వారా పోలీసులు వాహనదారులకు 12,577 హెల్మెట్లను అద్దెకు ఇచ్చారు. ఈ వినూత్న కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఉచితంగా హెల్మెట్లను అందించేందుకు స్పాన్సర్లు కూడా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తికి బేగంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనదారు ఐదారు అడుగుల ఎత్తుకు ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు హెల్మెట్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గాయాలను నుంచి కోలుకున్నాక.. స్వయంగా కార్యాలయానికి వచ్చి హెల్మెట్ లేకుంటే ప్రాణాలతో బయటపడేవాణ్ని కాదని, శిర్రస్తాణం ప్రాముఖ్యత తెలిసొచ్చిందని చెబుతూ తన వంతుగా 500 హెల్మెట్లను విరాళంగా అందిస్తానని తెలిపాడని డీసీపీ ట్రాఫిక్–1 కే రాహుల్ రెడ్డి తెలిపారు.


