మట్కాష్‌..! | matka kills poor families | Sakshi
Sakshi News home page

మట్కాష్‌..!

Aug 7 2016 8:08 PM | Updated on Oct 16 2018 2:30 PM

మట్కాష్‌..! - Sakshi

మట్కాష్‌..!

బతుకు బండి చక్రాన్ని లాగేందుకు పేద, మధ్య తరగతి వర్గాలు మట్కా క్రీడ పట్ల మోజు చూపిస్తున్నారు. ప్రతి రోజూ కాయాకష్టం చేసుకొన్న కూలీలు, కార్మికులు మట్కా ఆటకు బానిసై సంపాదించిన సొమ్మును పోగుట్టుకుంటున్నారు.

ఇదిగో ఇప్పుడే వెళ్లి ఎసట్లోకి బియ్యం గింజలు తీసుకొస్తా..ఆ చంటోళ్లను కాస్త బుజ్జగించు అంటూ ఇంటావిడ కొంగుకు ధైర్యం ముడేసి బయలుదేరిన ఆటో కార్మికుడు రాజేష్‌ (పేరు మార్చాం)..మలి పొద్దువాలాక ఖాళీ చేతులతో దీనంగా ఇంటి గడప తొక్కాడు..ఆకలితో విలవిలలాడుతున్న పిల్లల ఎండిన డొక్కలు..నాన్నా అన్నం అంటూ తండ్రిని చుట్టేస్తుంటే బిడ్డల చిన్ని పేగులకు సమాధానం చెప్పలేక తలదించుకున్నాడు..
 
                                                   ..ఇదీ నరసరావుపేటలో నిత్యం పేద కుటుంబాలను మట్కా ఆట కుదిపేస్తున్న కల్లోలం. కార్మికులు స్వేదాన్ని చిందించగా వచ్చిన నాలుగు డబ్బులను.. ఆశల వలవేసి మట్కా మహమ్మారి లాగేసుకుంటోంది. అత్యాశతో ఆటాడిన వారిని అప్పుల కార్ఖాలో పడేసి సమ్మెట దెబ్బలేస్తోంది. పోలీసు అధికారులను మామూళ్ల మత్తులో ముంచి..పక్క జిల్లాలకూ ఈ వ్యసనం విస్తరిస్తోంది.  
 
జిల్లాలో జోరుగా నిషేధిత క్రీడ
అత్యాశకుపోయి రోడ్డున..
పడుతున్న కార్మికుల కుటుంబాలు
పట్టించుకోని పోలీసు అధికారులు
 
నరసరావుపేట టౌన్‌: బతుకు బండి చక్రాన్ని లాగేందుకు పేద, మధ్య తరగతి వర్గాలు మట్కా క్రీడ పట్ల మోజు చూపిస్తున్నారు. ప్రతి రోజూ కాయాకష్టం చేసుకొన్న కూలీలు, కార్మికులు మట్కా ఆటకు బానిసై సంపాదించిన సొమ్మును పోగుట్టుకుంటున్నారు. వారిపై ఆధారపడిన జీవితాలను పస్తులపాటు చేస్తున్నారు. నరసరావుపేట కేంద్రంగా జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న మట్కా మహమ్మారికి అనేక కుటుంబాలు మటాష్‌ అవుతున్నాయి. ఒకప్పుడు బ్రాకెట్‌ అనే ఆటగా పేరొందిన ఈ మట్కా పట్టణంలో జోరుగా కొనసాగుతుంది. రూపాయికి రూ.70 వస్తాయన్న ఆశతో అనేక మంది ఈ ఆటకు బానిసై నేడు కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో వ్యాపారులు తగిలిన నంబర్లను ముందస్తుగా అనుకున్న ప్రదేశాల్లో గల విద్యుత్‌ స్తంభాలపైనా, ప్రహరీలపైనా రాసేవారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో నెట్‌లో మట్కా నంబర్లు చూసుకొనే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం ఈ ఆటను ఎప్పుడో నిషేధించినప్పటికీ అక్రమార్కులు అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పి యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని పావులూరి సుబ్బారావు పాఠశాల వద్ద, ప్రకాష్‌నగర్‌ రిక్షా సెంటర్‌వద్ద అక్రమ వ్యాపారులు రెండు కార్యాలయాలను తెరచి దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.  
 
ప్రతి రోజూ మూడుషోలు..
ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు మిలాన్‌ డే, 3 నుంచి 6 గంటల వరకు కల్యాణ్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు మిలాన్‌నైట్‌ అనే మూడు రకాల మట్కా ఆటలు కొనసాగుతున్నాయి. ఒకటి నుంచి వెయ్యి అంకెలు కోరుకోవచ్చు. ఏ నంబరు అయితే అదష్టం వరిస్తుందని కోరుకొంటారో అంత నగదు వ్యాపారులకు చెల్లించాలి. ఒక వేళ ఆ అంకె లాటరీలో వస్తే 70 రెట్లు వ్యాపారులు చెల్లిస్తారు. నగదు చెల్లింపు, కోరుకునే నంబర్‌ ఈ విధానమంతా కోడ్‌ భాషలో నడుస్తుంది. నంబర్‌ లాటరీలో ఎలా తీస్తారనే విషయాన్ని మాత్రం కొనుగోలు చేసిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. 
 
 లక్షల్లో వ్యాపారం..
నరసరావుపేట పట్టణంలో ప్రతి రోజూ రెండు లక్షల రూపాయల వరకు మట్కా వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. పట్టణంలో ఉన్న ముగ్గురు బడా వ్యాపారుల వద్ద ఉన్న ఏజెంట్లు చిలకలూరిపేట , పిడుగురాళ్ల, వినుకొండ, సత్తెనపల్లి, గుంటూరు, గిద్దలూరు, తాడిపర్తి, నంద్యాలలోని మాట్కా వ్యాపారాన్ని విస్తరించారు. అక్కడ కొనుగోలు చేసిన నంబర్లను ఇక్కడ వ్యాపారులకు ప్రతి రోజూ ఫోన్‌లో తెలియజేస్తారు. ఎవరికైనా నంబర్‌ తగిలితే రెండో రోజు పట్టణంలోని ఓ కార్పొరేట్‌ బ్యాంక్‌ వద్దకు పిలిచి వ్యాపారులు నగదును అప్పచెబుతున్నట్లు సమాచారం. ఈ డబ్బు ఎక్కనుంచి వస్తుంది..అసలు తెరవెనుక ఉన్న పాత్రధారులు ఎవరు అనే విషయం ఎవరికీ తెలియకుండా వ్యాపారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement