పండగకు వెళ్లొస్తూ..పరలోకాలకు

Three Number Died In Road Accident In Kodad - Sakshi

బంధు మిత్రులతో కలిసి సంక్రాతిని పండుగను ఆనందోత్సాహాలతో గడిపారు.. తిరిగి వస్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ దుర్ఘటనలో  భార్యభర్తలు, కుతూరు మృతిచెందగా కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమరబండ శివారులో బుధవారం చోటు చేసుకుంది. 

కోదాడ రూరల్‌ : హైదరాబాలోని చరల్లపల్లి ఈసీనగర్‌కు చెందిన రావి నాగమురళీకృష్ణ(48) ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అనే కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న భార్య కవిత(42), ఇంటర్మీడియట్‌ చదువుతున్న కూతురు ధనుష(17), కుమారుడు యునిత్‌లతో కలిసి  అత్తగారి గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి వెళ్లారు.

అక్కడ బంధువులతో ఆనందంగా గడిపిన వారు బుధవారం ఉదయం హైదరాబాద్‌ బయలుదేరారు. ఈ క్రమంలో ఎం జరిగిందో ఏమో కానీ కొమరబండ శివారుకు రాగానే వేగంగా ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం గాలిలో లేచి  అటువైపుగా హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టును బలంగా తగిలింది. దీంతో యునిత్‌ చెయ్యివిరిగి గాయాలతో బయట పడగా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. యునిత్‌ కారు వెనుక సీటులో పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు తెలిపారు. తల్లిదండ్రులు, అక్క మృతి చెందడంతో బాలుడు అనాథగా మిగిలాడు.

గాలిలో లేచిపడిన మృతదేహాలు...
కారు వేగంగా కల్వర్టును ఢీకొట్టడంతో  కవిత, ధనుషలు 15 మీటర్ల దూరంలో లేచిపడ్డారు.  సీటు »ñ బెల్టుపెట్టుకున్న మురళీకృష్ణ కారులోనే తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. కవిత తలపైభాగం విడిపోయి దూరంగా పడింది. కారులో ఇరుక్కుపోయిన అతన్ని పోలీసులు అతికష్టం మీద  బయటకు తీశారు.

అతివేగమే కారణమా..?
ఈ ప్రమాదానికి గల కారణం అతి వేగమే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా ఉండటంతోనే అదుపుతప్పి కారు దాదాపుగా 20మీటర్ల దూరం వరకు డివైడర్‌పై ఉన్న చెట్లను వేర్లతో సహా పెకిలించుకుని పూర్తిగా  అవతలివైపునకు వెళ్లి బలంగా ఢీకొట్టి ఉంటుందని చర్చించుకున్నారు. దీంతో పాటుగా  ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకున్నా పగిలిపోవడం, మృతదేహాలు దూరంగా ఎగిరిపడటం చూస్తుంటే అతి వేగమే కారణమని భావిస్తున్నారు.

మరో ముగ్గురికి గాయాలు...
నాగమురళీకృష్ణ కారు అవతలి వైపు  హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టడంతో ఓ కారులో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మెదక్‌జిల్లా రామాయంపేటకు చెందిన కంభంపాటి ఈశ్వర్, సోమనగారి స్వామి, హైదరాబాద్‌కు చెందిన కలువ అనిరుధ్‌లకు గాయాలయ్యాయి. వారు స్థానిక ప్రైవేట్‌ వైద్యాశాలలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదంపై ఆరా తీసిన ఏపీ హోంమినిస్టర్‌
ప్రమాదం జరిగిన సంఘటనపై ఎపీ హోం మినిస్టర్‌ చిన్న రాజప్ప కోదాడ పోలీసులను ఆరా తీశారు. గాయపడిన వారికి  మెరుగైన చికిత్స అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని తెలిపారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ...
ఘెర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడిన బాధితులకు మెరుగైన సహాయం అందే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటికే డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, పట్టణ, రూరల్‌ సీఐలు శ్రీనివాసరెడ్డి, రవిలతో పాటు రూరల్, అనంతగిరి ఎస్‌లు దశరథ, రామాంజనేయులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. మృతదేహాన్ని బయటికి తీస్తున్న పోలీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top