సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేరపూరిత హత్య..నేర పూరిత కుట్ర.. తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం.. సాక్ష్యాలను మాయం చేయడం..నేరస్తుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం.. అబద్ధమని తెలిసినా సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం.. నేరానికి ప్రేరేపించడం..’ఇవీ రోడ్డు ప్రమాదం కేసులో సంబంధం లేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మోపిన అభియోగాలు. అసలు యాక్సిడెంట్ సమయంలో అప్పలరాజు అక్కడ లేరు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెళ్లిన అప్పలరాజే పోలీసులకు సమాచారం అందించారు.
అలాంటప్పుడు అప్పలరాజుపై అభియోగాలు మోపడం రాజకీయ కుట్ర కాకపోతే ఏమనాలి.. కక్ష సాధింపులో భాగమని అనడానికి ఇంకేం చెప్పాలి.. రోడ్డు ప్రమాదంలో దానయ్య చనిపోవడానికి కారణం సిద్ధార్ద్ త్యాడి కాదని, సీదిరి తనయుడు ఆరవ్ వర్మ కారకుడని పోలీసులు అప్పలరాజుకు చెప్పివుంటే, ఆ తర్వాత కూడా కొడుకును తప్పించడానికి త్యాడిని ఇరికించి ఉంటే కచ్చితంగా నేరమవుతుంది. లేదూ దానయ్య మరణాన్ని దాచేసి అసలు అటువంటిది జరగలేదని బుకాయిస్తే అది ఇంకా పెద్ద నేరమవుతుంది. కానీ, సీదిరి కుమారుడు ఆరవ్ ఫోన్ నుంచే సంఘటన స్థలం నుంచి 108కు ఫోన్ వెళ్లింది. ఇక సీసీ టీవీలు ప్రైవేటు వ్యక్తులవే అయినా అందులో ఫుటేజ్ ఏమాత్రం పోలేదు. అలాంటప్పుడు ఇందులో హత్య కోణం ఎక్కడుందో పోలీసులు..వారిని ప్రేరేపించిన పాలకులే చెప్పాలి.
ఇన్ని సెక్షన్లా?
సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. న్యాయ కోవిదులు కూడా పోలీసుల తీరును ఆక్షేపిస్తున్నారు. యు/ఎస్ 105 ఆర్/డబ్లూ 61(2) అఫ్ బీఎన్ఎస్, 231,238,240, 242,249 ఆర్/డబ్ల్యూ 49బిఎన్ఎస్ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. పాలకులు కావల్సినట్టు పోలీసులు వ్యవహరించారని స్పష్టమవుతుందంటూ ఆరోపణలు ఉన్నాయి. 41 నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్పై విడుదల చేయాల్సిన ఘటన కేసులో తొలుత కుమారుడిని, ఆ తర్వాత తండ్రిని అరెస్టు చేశారంటే ఎంత క«థ నడిచిందో అర్ధమవుతోంది.
చంద్రబాబు అండ్కో పగ..
వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది.
సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు.


