డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు | RTC Bus Driver Died Of Heart Attack In Driving In Hyderabad | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

Feb 27 2019 2:36 AM | Updated on Feb 27 2019 7:40 AM

RTC Bus Driver Died Of Heart Attack In Driving In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి పార్కింగ్‌లో ఉన్న ఒక ఆటో, మూడు కార్లను ఢీకొట్టిన సంఘటన మంగళవారం రాత్రి చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందారు. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాణిగంజ్‌ డిపో–1కు చెందిన ఏపీ29జడ్‌3560 219 నంబరు బస్సు పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్‌కు 45 మంది ప్రయాణికులతో వెళ్తుండగా మార్గమధ్యంలో చందానగర్‌ ఆర్‌.ఎస్‌.బ్రదర్స్, మలబార్‌ గోల్డ్‌ ముందుకురాగానే డ్రైవర్‌ మల్లారెడ్డికి గుండెనొప్పి రావడంతో బస్సు అదుపుతప్పి మొదట ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న డ్రైవర్‌ పక్కకు దూకేశాడు. ఆ తర్వాత పార్కింగ్‌ చేసి ఉన్న మూడు కార్లను బస్సు ఢీ కొట్టింది. ఇందులో రెండు కార్లు, ఓ ఆటో పూర్తిగా ధ్వంసం కాగా మరో కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ çఘటనలో శైలజ అనే బస్సు ప్రయాణికురాలికి స్వల్పగాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మిగతావారంతా క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రైవర్‌ మల్లారెడ్డి మృతి
బస్సు నడుపుతున్న డ్రైవర్‌ మల్లారెడ్డి గజ్వేల్‌కు చెందినవారు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్నప్పుడు గుండెపోటుకు గురైనప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి రోడ్డు ఎడమవైపునకు బస్సును తిప్పడంతో పెనుప్రమాదం తప్పింది. అతని పరిస్థితిని గమనించిన ప్రయాణికులు, స్థానికులు మల్లారెడ్డిని వెంటనే సమీపంలోని అర్చన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మల్లారెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా పని ఒత్తిడితోనే ఆయన గుండెపోటుకు గురయ్యారని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపించాయి.

తప్పిన పెనుప్రమాదం
ఈ ఘటన జరిగిన చందానగర్‌ జాతీయరహ దారి అత్యంత రద్దీగా ఉన్నప్పటికీ డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమా దం తప్పింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి స్వల్ప దూరంలోనే బస్‌స్టాప్‌ ఉన్నప్పటికీ, అక్కడికి చేరుకోవడానికి ముందే బస్సు నిలిచిపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కండక్టర్‌ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement