ఇక నుంచి పాకిస్థానీ కాదు

Musharraf Pakistan Citizenship Cancelled - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్‌ ముషర్రఫ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పాక్‌ ఆపద్ధర్మ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి రానున్నట్లు ప్రధాని నసీర్‌ ఉల్‌ ముల్క్‌ ప్రకటించారు. ఈ మేరకు నేషనల్‌ డేటాబేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ పాస్‌పోర్టు డైరెక్టోరేట్‌ కార్యాలయాల నుంచి ప్రకటన వెలువడింది. 

కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన జాతీయత గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష‍్టం చేసింది. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు కూడా ఆటోమేటిక్‌గా రద్దైపోతుంది. ముషర్రఫ్‌ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీల నిలుపుదల ఉద్దేశంతోనే కోర్టు ఇది వరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ముషర్రఫ్‌కు.. తాజా ఆదేశాలు ఇబ్బందికరంగా మారొచ్చు. పాస్‌పోర్టు రద్దుతో దుబాయ్‌లో ఆయన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే కేసుల విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాక్‌కు రప్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక డాక్యుమెంట్ల ద్వారా ఆయన్ని పాక్‌కు రప్పించనున్నారు. ముషర్రఫ్‌ కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది కూడా.

2007లో అత్యవసర పరిస్థితి విధించటం, సుప్రీం కోర్టు జడ్జిల గృహనిర్భందం, రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా వ్యవహరించటం, తదితర ఆరోపణలపై ముషర్రఫ్‌ ‘దేశ ద్రోహం’ కేసును ఎదుర్కుంటున్నారు. 2016లో చికిత్స కోసం దుబాయ్‌ వెళ్లిన ముషర్రఫ్‌.. త్వరలో జరగబోయే పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top