ప్రేమజంట పరారీ
తమిళనాడులో దారుణం
టీ.నగర్: ప్రేమ జంట పరారైన వ్యవహారంలో ప్రియుడి చెల్లిలిని ప్రియురాలి బంధువులు హతమార్చారు. వివరాలు.. తమిళనాడు అరియరూలు జిల్లా కందకుడి గ్రామానికి చెందిన మణిమారన్, అరుంబు దంపతుల కుమార్తె అరివళగి (23). ఈమెను కీళకాంగినూరు గ్రామానికి చెందిన తంగరాజ్ కుమారుడు కాశీనాథన్కు ఇచ్చి నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి మూడేళ్ల కుమార్తె రోరిషి ఉంది. కాశినాథన్ ప్రస్తుతం కేరళలో పని చేస్తున్నాడు. ఇదిలాఉండగా, అరివళగి అన్న కన్నన్ (27), కాశినాథన్ పెద్ద అన్న కరుణానిధి కుమార్తె మీనా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కరుణానిధి కుటుంబీకులు వ్యతిరేకత తెలిపారు. అయితే, దీన్ని మీరి ఇరువురు వివాహం చేసుకోవడానికి ఇల్లు విడిచి పరారయ్యారు.
దీంతో ఆగ్రహించిన మీనా అన్న మారియప్పన్ (21), కాశినాథన్ మరో అన్న సెల్వరాజు (37), కన్నన్ను కలిసి అరివళగిని హత్య చేస్తామని బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం రాత్రి మారియప్పన్, సెల్వరాజ్లు అరివళగితో గొడవకు దిగారు. సమాచారం అందుకున్న అరివళగి కుటుంబీకులు ఆమెను చూసేందుకు రాగా అరివళగి శవంగా పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. దీంతో అరివళగి మృతిపై తమకు అనుమానం ఉందని, విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కీళపగులూర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు మారియప్పన్, సెల్వరాజులను ఆదివారం అరెస్టు చేసి, సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.