
అన్నవరం: పంపానది ఒడ్డున గల కొండల్లో నిర్మిస్తున్న పుష్కరకాలువ కోసం బాంబులతో కొండలను బద్దలు కొడుతుండడంతో అటు అన్నవరంలో ఇటు దేవస్థానంలో భవనాలకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మోతాదులో పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్లాస్టింగ్లు చేయడం వల్ల మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రదేశమంతా ఆ పేలుళ్లకు అదిరిపోతోంది. అన్నవరం దేవస్థానంలో అయితే బుధవారం ఈ పేలుడుధాటికి సత్రాలు భూకంపం వచ్చినట్టు అదిరిపోయాయి. సత్రాల్లో బస చేసిన భక్తులు బయటకు పరుగులుతీశారు. అన్నవరంలో అయితే స్వల్పభూకంపం వచ్చినట్టుగా భవనాలు ఊగిపోవడం, ఆ తరువాత దూరంగా పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
కలెక్టర్కు ఇన్చార్జ్ ఈఓ వినతి
జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రాకు బుధవారం అన్నవరం దేవస్థానం ఇన్చార్జ్ ఈవో ఈరం కి జగన్నాథరావు ఈ బాంబుపేలుడు విషయమై వినతి పత్రం పంపించారు.ఈ పేలు ళ్లు కారణంగా సత్రాల్లో బస చేసే భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆలయ కట్టడాలు బీటలు వారే ప్రమాదం ఉందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవలసిందిగా ఆయన అభ్యర్థించారు. ఈ లేఖ కాపీలను మైన్స్ విభాగానికి, రెవెన్యూ, పోలీసు విభాగాలకు పంపినట్టు ఈవో తెలిపారు.