భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ, ఏపీ ఇంజనీర్ల బృందం
భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంలో ఏర్పడే ముంపుపై సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరం కేంద్రానికి నివేదిక అందజేస్తామని ఇంజనీర్ల బృందం వెల్లడించింది. తెలంగాణ, ఏపీకి చెందిన ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన కమిటీ గురువారం భద్రాచలంలో పర్యటించింది. ఈ సందర్భంగా గోదావరి కరకట్ట, స్లూయిజ్ పాయింట్లతో పాటు విస్తా కాంప్లెక్స్ తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద గోదావరి వరదల సమయాన నీటి ప్రవాహం, కరకట్ట రక్షణ, డ్రెయినేజీ వ్యవస్థ, నిర్మాణాల భద్రత, ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రధానంగా భద్రాచలంలోని ఎనిమిది స్లూయిజ్ పాయింట్లను పరిశీలించినట్లు చెప్పారు. వరదల సమయాన వాటి పటిష్టత, పనితీరుపై అధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. కరకట్టను బలోపేతం చేయడంతో పాటు వరద నివారణకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు తెలిపారు. పరిశీలన పూర్తయ్యాక నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్ర ప్రాంతంలో బలహీనమైన కరకట్ట పరిస్థితిని ఇప్పటికే ఉన్నత స్థాయి ఇంజనీర్ల, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.


