యమ్నంపేట్లో 72 అంతస్తుల భవనం
హెచ్ఎండీఏకు ముంబై సంస్థ దరఖాస్తు
అనుమతులు లభిస్తే దక్షిణ భారత్లోనే అతిపెద్ద హైరైజ్గా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు పడమటి వైపున అలరారుతున్న ఆకాశ హరమ్యాల తరహాలోనే తూర్పు వైపున కూడా హైరైజ్ భవనాలకు దిగ్గజ నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఓ నిర్మాణ సంస్థ 62 అంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులు పొందింది. మరోవైపు ఘట్కేసర్కు సమీపంలోని రాంపల్లి యమ్నంపేట్ వద్ద ఏకంగా 72 అంతస్తుల భవన నిర్మాణానికి ముంబయికి చెందిన ఒక బడా సంస్థ హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ దరఖాస్తు అధికారుల పరిశీలనలో ఉంది. కాగా డ్రాయింగ్తో పాటు, మరికొన్ని అంశాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ భవన నిర్మాణానికి ఎయిర్పోర్టు అథారిటీతో పాటు వివిధ సంస్థల అనుమతులు కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు. సుమారు 245 మీటర్ల వరకు ఎత్తు వరకు ఉండే ఈ భవన సముదాయంలో 3, 4 పడక గదుల ఫ్లాట్లను నిర్మించనున్నట్లు ముంబై సంస్థ తన దరఖాస్తులో తెలిపింది. హెచ్ఎండీఏ నుంచి దీనికి అనుమతులు లభిస్తే దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద హైరైజ్ బిల్డింగ్గా ఇది అవతరించనుంది. కానీ ఇప్పటివరకు ఉన్న లోపాల ప్రకారం సాంకేతిక అనుమతులను ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చునని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు.


