సాక్షి, సంగారెడ్డి: ప్రజాస్వామ్య వ్యవస్థకు జర్నలిజం నాలుగో స్తంభమని.. వార్తల ప్రసారంలో వేగం ఎంత అవసరమో విశ్వసనీయత అంతకంటే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సత్యం, నైతికత, సామాజిక బాధ్యతలను జర్నలిజం ఎల్లప్పుడూ పరిరక్షించాలని ఆయన సూచించారు.
గురువారం.. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సంగారెడ్డి జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సంగారెడ్డి వేదికగా జర్నలిస్టుల మహాసభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు ప్రజల గొంతుకగా, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. వేగవంతమైన సమాచార ప్రసారంతో పాటు వార్తలలో వాస్తవికత, విశ్వసనీయత, నైతిక విలువలు పాటించడం జర్నలిజం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యను ప్రభుత్వం సమీక్షిస్తోందని, త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. మీడియా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో పాటు సమాజంలో చైతన్యం కల్పించే కీలక బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, జిల్లా అధ్యక్షులు బండారి యాదగిరి, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, మాజీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు ఫైజల్, పానుగంటి కృష్ణ, అనిల్ కుమార్, ఆసిఫ్, సిద్ధన్న పాటిల్, మునిపల్లి యాదగిరి, మున్సిపల్ చైర్పర్సన్ లు వనిత, అంజమ్మ, జిల్లా సీనియర్ జర్నలిస్టులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.


