పోలవరం ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని రూ. 352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు
‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడికి పోల‘వరం’
రాయల రఘు సంస్థ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ పనులు చేస్తున్నందునే భారీ నజరానా
ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీలో మిగిలిన పనుల అంచనా వ్యయం భారీగా పెంపు
రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచేసిన చంద్రబాబు సర్కారు
కేవలం 20 నెలల్లోనే అంచనా వ్యయం రూ.444.05 కోట్లు పెంచేయడంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం
డీపీటీకి ఇది మరో నిదర్శనం అని అభివర్ణిస్తున్న వైనం.. ఎడమ కాలువ ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులు 60–సీ కింద 2016లో తొలగింపు
వాటిని నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు నామినేషన్పై అప్పగింత
2024 నాటికి 5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిన పనుల విలువ రూ.81.63 కోట్లే
దానిని రూ.352.60 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబర్ 3న ఉత్తర్వులు
అంటే అంచనా వ్యయాన్ని రూ.270.97 కోట్ల మేర పెంచేసిన వైనం.. అవే పనులకు రూ.293.66 కోట్లతో 2024 అక్టోబరు 9న టెండర్ నోటిఫికేషన్ జారీ
4.68% అధిక ధర.. రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు అప్పగింత
అంచనా వ్యయం పెంచి, అధిక ధరలకు కట్టబెట్టడంపై అప్పట్లోనే విమర్శలు
ఈ దోపిడీని ‘వియ్యంకులకు పోలవరం’ శీర్షికన ఫిబ్రవరి 8న బయటపెట్టిన ‘సాక్షి’
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచేస్తూ శుక్రవారం చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఆ పనుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.444.05 కోట్లు పెంచేసిందన్న మాట. కేవలం 20 నెలల్లోనే అంచనా వ్యయాన్ని 126 శాతం పెంచేయడంపై ఇంజినీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పనులను ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ చేస్తుండటం వల్లే చంద్రబాబు ప్రభుత్వం భారీ స్థాయిలో అంచనా వ్యయాన్ని పెంచేసిందని.. డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో)కి ఇది మరో నిదర్శనమని ఎత్తిచూపుతున్నారు.
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ (93.7 నుంచి 111.487 కిలోమీటర్ల వరకు) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ఈ పనుల్లో 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల పొడవున లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను ఏపీడీఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 60–సీ నిబంధన కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తొలగించింది. ఆ పనులను రూ.142.88 కోట్లకు యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే (మైదుకూరు) పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే–హెచ్ఈఎస్ (జేవీ)కు 5ఏ ప్యాకేజీ కింద 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టింది.
సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్, పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ చేసిన పనులు పోగా 5, 5ఏ ప్యాకేజీల్లో 2024 నాటికి రూ.81.63 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఆ పనుల వ్యయాన్ని 2023–24 ధరల ప్రకారం రూ.352.60 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబరు 3న చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. రూ.270.97 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది.
అంచనాలు పెంచి అధిక ధరలకు రాయల రఘుకు అప్పగింత
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిన పనులను ఆర్నెల్లలోగా పూర్తి చేయాలని గడువు పెట్టి.. రూ.293.66 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 అక్టోబర్ 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో వాటిని 4.68 శాతం అధిక ధరకు.. అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన రాయల రఘుకు చెందిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి, అధిక ధరలకు కట్టబెట్టినా, రాయల రఘు సంస్థ అత్యంత నాసిరకంగా పనులు చేస్తుండటాన్ని ‘వియ్యంకులకు పోలవరం’ శీర్షికన ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బట్టబయలు చేసింది.

‘నీకింత.. నాకింత’ అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోండటం వల్లే పనులు అత్యంత నాసిరకంగా చేస్తున్నారని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.
తాజాగా మళ్లీ అంచనా వ్యయం పెంపు
పోలవరం ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల్లో తాండవ నదిపై నిర్మించిన అక్విడెక్టు దాటిన తర్వాత 2 కొండల మీదుగా కాలువ తవ్వాలి. కొండల వైపున కాలువకు ఒక గట్టు.. మరోవైపు ఇంకో గట్టు ఉంటుంది. కొండల వైపున కాలువ తవ్వడం వల్ల గట్టు వేయాల్సిన అవసరం లేదు. కొండలకు మరో వైపున 500–600 మీటర్ల పొడవున మట్టికట్టతో గట్టును వేయడంతోపాటు కాంక్రీట్ రిటైనింగ్ వాల్ను నిర్మించేలా డిజైన్ను మార్చారు. ఈ పనులకు రూ.100 నుంచి రూ.150 కోట్లకు మించి కాదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
కానీ ఒకేసారి అంచనా వ్యయాన్ని రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంచనా వ్యయాన్ని రూ.444.05 కోట్ల మేర పెంచేయడాన్ని బట్టి చూస్తే.. ఈనాడు కిరణ్ వియ్యంకుడికి మరోసారి భారీగా ప్రయోజనం చేకూర్చడానికేనన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. 5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిన పనులను రూ.307.41 కోట్లకు రాయల రఘు సంస్థకు అప్పగించారు.
అందులో 15% అంటే రూ.46.12 కోట్ల మేర అంచనా వ్యయం పెరిగితే ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు అప్పగించే అధికారం చీఫ్ ఇంజినీర్కు ఉంటుంది. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్కు అప్పగించాలి. కానీ.. అంచనా వ్యయం రూ.444.05 కోట్ల మేర పెంచేసినా ఆ పని రాయల రఘు సంస్థే చేస్తోండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు.


