
మార్కెట్ కు దివాలా బిల్లు జోష్
మారిషస్ పన్ను భయాలను దివాలా బిల్లు ఆమోదం పొందడం కొంత వరకు తగ్గించడంతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది.
♦ 7,900కు నిఫ్టీ...52 పాయింట్లు లాభం
♦ 193 పాయింట్ల లాభంతో 25,790కు సెన్సెక్స్
మారిషస్ పన్ను భయాలను దివాలా బిల్లు ఆమోదం పొందడం కొంత వరకు తగ్గించడంతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ వంటి బ్యాంక్ షేర్ల జోరుతో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు పెరిగి 25,790 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 7,900 పాయింట్ల వద్ద ముగిశాయి.
సంస్కరణల్లో జాప్యం జరుగుతున్నా భారత్ 7.3% వృద్ధిని సాధించగలదన్న ఐక్యరాజ్యసమితి నివేదిక సానుకూల ప్రభావం చూపించింది. మార్చి పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) సెంటిమెంట్ మెరుగపడింది. క్యాపిటల్ గూడ్స్ సూచీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
దివాలా బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో బ్యాంక్ షేర్లు ఒక వెలుగు వెలిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 3.4% పెరిగి రూ.232 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో బాగా పెరిగిన షేర్ ఇదే. ఎస్బీఐ 1.87% పెరిగి రూ.188 వద్ద, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 % పెరిగి రూ.1,150 వద్ద ముగిశాయి. దివాలా కేసులను త్వరితంగా పరిష్కారమయ్యేలా చూసే దివాలా బిల్లు ఆమోదంతో బ్యాంక్ల వంటి రుణ సంస్థలు తమ మొండి బకాయిలను త్వరితంగా రికవరీ చేసుకోగలవని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) శ్రేయాశ్ దేవాల్కర్ చెప్పారు.
మళ్లీ రూ.5 లక్షల కోట్లకు టీసీఎస్ మార్కెట్ క్యాప్ ఐటీ దిగ్గజం, టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మళ్లీ గురువారం రూ.5 లక్షల కోట్ల మార్క్ను దాటింది. 2014 జూలైలో తొలిసారిగా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరింది.