34 వేల దిగువకు సెన్సెక్స్‌

Sensex below 34 thousand - Sakshi

కొనసాగిన పీఎన్‌బీ స్కామ్‌ ప్రభావం

ఏడాది కనిష్టానికి పీఎస్‌ బ్యాంక్‌ షేర్లు  

236 పాయింట్ల నష్టంతో 33,775కు సెన్సెక్స్‌

74 పాయింట్లు పతనమై 10,378కు నిఫ్టీ  

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణం ప్రకంపనలు సోమవారం స్టాక్‌ మార్కెట్‌ను నష్టాల పాలు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34 వేల పాయింట్లు, నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఈ స్టాక్‌ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 236 పాయింట్లు నష్టపోయి 33,775 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 10,378 పాయింట్ల వద్ద ముగిశాయి.

సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగియడంతో ద్రవ్యలోటు మరింతగా పెరుగుతుందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 112 పాయింట్లు లాభపడగా,  మరో దశలో 456 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 568 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 10,303 పాయింట్లకు పడిపోయింది. 

బ్యాంక్‌ షేర్లు బేర్‌..
పీఎన్‌బీ స్కామ్‌ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లపై బాగానే ప్రతికూల ప్రభావం చూపుతోంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్‌ షేర్లపై ఒత్తిడి కొనసాగుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఈ తుఫాన్‌ చల్లబడేదాకా ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంభిస్తారని వివరించారు.

యూకో బ్యాంక్‌ 4.6 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 6.3 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5.4 శాతం, సిండికేట్‌ బ్యాంక్‌6.4 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 6.7 శాతం, కార్పొరేషన్‌ బ్యాంక్‌ 3.1 శాతం, ఎస్‌బీఐ 1.5 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.6 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.2 శాతం చొప్పున నష్టపోయాయి.
 
4 రోజుల్లో 10 వేల కోట్లు ఆవిరి..
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ పతనం వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగింది. సోమవారం  ఈ షేర్‌ 7.3  శాతం క్షీణించి రూ.116 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10 శాతం నష్టపోయి తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.114ను తాకింది. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ 28 శాతం క్షీణించింది. ఈ నాలుగు రోజుల్లో రూ.10,975 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరైంది.  భూషణ్‌ స్టీల్‌ రేసులో ముందు వరుసలో ఉందన్న వార్తల నేపథ్యంలో టాటా స్టీల్‌ షేర్‌ 5.8 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top