వ్యవసాయాదాయం పెంచేలా బడ్జెట్ ఉందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) పేర్కొంది.
ముంబై: వ్యవసాయాదాయం పెంచేలా బడ్జెట్ ఉందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) పేర్కొంది. దీర్ఘకాల దృష్టితో చూస్తే గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్ సానుకూలమైందని తెలిపింది. దీర్ఘకాల గ్రామీణ పరపతి నిధిని మూడు రెట్లు (రూ.15,000 కోట్లకు )పెంచడం-వ్యవసాయరంగంలో మూలధన కల్పన పెంచే ప్రయత్నమని నాబార్డ్ చైర్మన్ హెచ్.కె. భన్వాలా చెప్పారు. రూ.25 వేల కోట్ల గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కొనసాగించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బహుళవిధాలుగా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
సూక్ష్మ సేద్యానికి రూ.5,300 కోట్ల తోడ్పాటునందించడం ఆహ్వానించదగ్గ చర్య అని వివరించారు. వ్యవసాయానికి జాతీయ మార్కెట్ దిశగా చర్యలు తీసుకోవడం దీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలిగించేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలివ్వాలన్న లక్ష్యాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.8.5 లక్షల టన్నులకు పెంచడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.