
‘అగ్రి’ బాధితులకు అండగా ఉద్యమ కార్యాచరణ
అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు.
- వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
- మేలోగా పరిహారం ఇవ్వకుంటే ఆందోళన
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. వచ్చే నెలాఖరులోగా దీన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మే లోగా పరిహారం ఇవ్వని పక్షంలో జూన్ లో మరో కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళతామన్నారు. అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబీకుల ఇళ్లకు తమ పార్టీ జిల్లా నేతలు వెళ్లి పరామర్శించి, వారికి మనోధైర్యం కలిగిస్తారని అంబటి చెప్పారు.
హైదరాబాద్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల తో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలో, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితురాలు నీరాబి ఆత్మహత్య, వెంకటనర్సమ్మల మృతి పట్ల అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ అంశంపై తమ పార్టీ ఉద్యమించడంతో శాసనసభలో చంద్రబాబు స్పందించారని, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ముందుగా రూ. 3 లక్షలు ఇస్తామని ప్రకటించారని, రూ.10 లక్షలు ఇస్తే గానీ న్యాయం జరగదని తమ పార్టీ డిమాండ్ చేయడంతో, రూ.ఐదు లక్షలకు పరిహారం పెంచారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని, టీడీపీ సర్కార్ మెడలు వంచైనా సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుం దని భరోసా ఇచ్చారు.