ఒంగోలులో టీడీపీ అరాచకం | YSRCP Activists Arrest In Ongole | Sakshi
Sakshi News home page

ఒంగోలులో టీడీపీ అరాచకం

Apr 12 2019 8:12 AM | Updated on Apr 12 2019 8:12 AM

YSRCP Activists Arrest In Ongole - Sakshi

ఒంగోలు 3వ డివిజన్‌ అగ్జీలియం స్కూల్‌ 45,46 పోలింగ్‌ బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్న డీఎస్పీ శ్రీనివాసాచారి

సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు అగ్జిలీయం పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ల్లో తెలుగుదేశం ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ అక్కడికి వెళ్లి పోలింగ్‌ బూత్‌లో కూర్చుని పోలింగ్‌ ఆపించారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు బాలినేని శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకొని పోలింగి తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. గోరంట్ల కాంప్లెక్సు వద్ద బాలినేని వాహనాలు, దామచర్ల వాహనాలు ఎదురయ్యాయి. అక్కడ వారి అభిమానులు, కార్యకర్తలు గుమిగూడారు. వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ నాయకుడు ప్రసాద్‌పై దౌర్జన్యం చేయడంతో పాటు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై గొడవ జరిగింది. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

దామచర్లను అక్కడి నుంచి పంపించారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు గొడవకు దిగకుండా బాలినేని వారిని నియంత్రించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలు  ఏబీఎం కళాశాల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లను పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. డీఎస్పీ అక్కడికి చేరుకొని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలు గుమిగూడారు. ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేశారు. బాలినేని డీఎస్పీతో మాట్లాడి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను విడిపించారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్‌ అనుచరులు కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యాలకు దిగారు. వారికి ఉన్న పోలీసు పలుకుబడిని ఉపయోగించి కార్యకర్తలపై కేసులు పెట్టించారు.

ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దౌర్జన్యానికి దిగారు. బాలినేని, కాకుమాని రాజశేఖర్‌ వంటి నాయకులు టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొన్నారు. అగ్జిలియం, ఏబీఎం వద్ద జరిగిన సంఘటనలు కొద్దిపాటి ఉద్రిక్తలకు దారి తీశాయి. టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. ఓపీఎస్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద కొందరు టీడీపీ మహిళలు వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకొనే పనిలో పడ్డారు. దీన్ని  అక్కడున్న నాయకులు భాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డి తదితరులు టీడీపీ మహిళా కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఓపీఎస్‌ వద్దకు చేరుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement