యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు సహకరిస్తామని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు.
అనంతపురం:యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన అంజాద్ పర్వేద్ ను పట్టుకునేందుకు తమవంతు సహకరం అందిస్తామని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికి సంబంధించి స్పందించిన ఎస్పీ.. ఆ కేసును హిందూపురంలో నమోదు చేయలేమన్నారు. అసలు నేరం ఎక్కడైతే జరిగిందో అక్కడే బాధితులు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బెంగళూరులో నిరుద్యోగుల నుంచి రూ. 30 కోట్ల వసూళ్లు చేసిన వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నిందితున్ని పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులకు సహకరిస్తామని తెలిపారు.
'యాహూ'లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంజాద్ పర్వేద్ అనే ఉద్యోగి బెంగళూరులో సుమారు రూ.30కోట్లకు...కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి బిచాణా ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు.