దేవుని మార్గంలో విలువలతో కూడిన జీవనం సాగిస్తే సుఖశాంతులు లభిస్తాయని రెవరెండ్ ఈడీరాజాసింగ్ అన్నారు.
అనంతపురం కల్చరల్, న్యూస్లైన్: దేవుని మార్గంలో విలువలతో కూడిన జీవనం సాగిస్తే సుఖశాంతులు లభిస్తాయని రెవరెండ్ ఈడీరాజాసింగ్ అన్నారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో ఇండియన్ ఇవాంజికల్ మిషన్ నేతృత్వంలో మూడు రోజులుగా సాగిన 26వ రాష్ట్ర స్థాయి స్త్రీల మైత్రీ సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన మిషనరీలు, మత ప్రబోధకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.
బెంగళూరు నుంచి బైబిల్ ప్రసంగీకులు డాక్టర్ ఈడీ రాజాసింగ్, కర్నూలు నుంచి సిస్టర్ ఎన్జే సువర్ణ బెంజిమెన్ తదితరులు ప్రతినిత్యం బైబిల్లోని పలు ఘట్టాలను వివరించారు. దేవుని మూల స్వరూపాన్ని తెలుసుకున్ననాడు ఐహిక సుఖాల వెంటపడరని ఉద్బోదించారు. ప్రాంతీయ విబేధాలు, సంకుచిత స్వభావం వీడి సాటి మనిషి పట్ల ప్రేమను పంచేలా చేయడానికే స్త్రీల సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. మతపెద్దల ప్రసంగాలను యూత్ సభ్యుడు సురేష్ అనువదించారు. సంస్థ కన్వీనర్ రెవ. ఆర్.సాలేమ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ప్రతిభ చూపినవారికి బహుమతులను అందజేశారు. రాష్ట్రం శాంతిభద్రతలతో సుభిక్షంగా ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ఫీబా జయరాజ్, పలువురు సంఘ కాపారులు, మిషనరీలు సామూహిక ప్రార్థనలు చేశారు.