ఉద్యోగినులకు రెండేళ్లు పిల్లల సంరక్షణ సెలవు | The height of the sail to power ..! | Sakshi
Sakshi News home page

ఉద్యోగినులకు రెండేళ్లు పిల్లల సంరక్షణ సెలవు

Jan 6 2015 1:46 AM | Updated on Aug 18 2018 8:05 PM

ఉద్యోగినులకు రెండేళ్లు పిల్లల సంరక్షణ సెలవు - Sakshi

ఉద్యోగినులకు రెండేళ్లు పిల్లల సంరక్షణ సెలవు

కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె (హెచ్‌ఆర్‌ఏ), పెన్షన్, గ్రాట్యుటీ... తదితర అంశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్లను పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) పూర్తిగా ఆమోదించలేదు.

  • 10వ పీఆర్సీ సిఫారసు
  •  కమిటీ పూర్తి నివేదికను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
  •  మరీ తక్కువగా డీఏ సూత్రీకరణ
  •  అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకే రకంగా లేని హెచ్‌ఆర్‌ఏ
  •  ఇంటి అద్దె పరిమితి పెంపు
  • సాక్షి, హైదరాబాద్: కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె (హెచ్‌ఆర్‌ఏ), పెన్షన్, గ్రాట్యుటీ... తదితర అంశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్లను పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) పూర్తిగా ఆమోదించలేదు. ఉద్యోగులకు నిరాశ కలిగించే విధంగా సిఫారసులు చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు చేసిన కొన్ని ప్రతిపాదనలను ఆమోదించింది. పి.కె.అగర్వాల్ నేతృత్వంలోని పదో పీఆర్సీ రూపొందించిన (5 వాల్యూమ్‌లు, 1,856 పేజీలు) నివేదికను ఏపీ ప్రభుత్వం  విడుదల చేసింది. ముఖ్యాంశాలివీ..
     
    కేంద్ర ప్రభుత్వం తరహాలో మహిళా ఉద్యోగులకు రెండేళ్లు పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలి. ఉద్యోగిని సర్వీసులో ఎన్ని దఫాలుగా అయినా ఈ సెలవును వాడుకోవచ్చు. అయితే తొలి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకే ఈ సెలవు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
     
    ఉద్యోగుల భత్యాల్లో డీఏ (కరువు భత్యం) అత్యంత ముఖ్యమైన అంశం. కేంద్రం నిర్ణయించే డీఏ పెంపును బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిర్ణయించడానికి పీఆర్సీ ప్రతిపాదించే సూత్రీకరణను ఆధారంగా తీసుకుంటారు. కేంద్రంలో ఒక శాతం డీఏ పెరిగితే రాష్ట్రంలో 0.856 శాతం పెంచాలని తొమ్మిదో పీఆర్సీ సూత్రీకరించింది. పదో పీఆర్సీ ప్రతిపాదించిన తాజా సూత్రీకరణ ప్రకారం.. 0.524 శాతం పెరగనుంది.
     
    అర్ధ వేతన సెలవులను పదవీ విరమణ సమయంలో నగదుగా మార్చుకొనే అవకాశాన్ని  స్థానిక సంస్థల ఉద్యోగులు, టీచర్లు, ఎయిడెడ్ విద్యా సంస్థల సిబ్బందికీ పునరుద్ధరించాలి.
     
    పే స్కేళ్లు పెరిగిన నేపథ్యంలో.. రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచాలి. రూ. 20 లక్షలకు పెంచాలన్నది ఉద్యోగ సంఘాలు డిమాండ్ .
     
    అంత్యక్రియల ఖర్చును రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచాలి.

    సీసీఏ హైదరాబాద్‌లో గరిష్టంగా రూ.1,000, విశాఖ, విజయవాడలో రూ.700, మిగతా కార్పొరేషన్లలో రూ.500 ఇవ్వాలి. సీసీఏను కొత్తగా 11 పట్టణాలకు పీఆర్సీ విస్తరించింది. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతిలో కూడా సీసీఏ చెల్లించాలి.
     
    ఇంటి అద్దె భత్యం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 శాతం, 2 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రేటర్ విశాఖ, అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరంలో 20 శాతం, 5 వేలు- 2 లక్షల మధ్య జనాభా ఉన్న పట్టణాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం గరిష్ట పరిమితిని రూ. 12 వేల నుంచి రూ. 20 వేలకు పెంచారు. మిగతా ప్రాంతాల్లో ఉన్న గరిష్ట పరిమితిని రూ. 8 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు. నగరాలు/పట్టణాల పరిధిని 8 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు పెంచాలని ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగులకు తిరుపతి హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని కమిషన్ సూచించింది. 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధిలోకి నంద్యాల, ఒంగోలు, ప్రొద్దుటూరు, విజయనగరం పట్టణాలను చేర్చింది. 14.5 శాతం పరిధిలోకి పలాస, కాశీబుగ్గ, పార్వతీపురం, మండపేట, జగ్గయ్యపేట, మాచర్ల, పిడుగురాళ్ల, తాడేపల్లి, రేపల్లె, వెంకటగిరి, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట, ఎమ్మిగనూరు, డోన్, నగరి, పుత్తూరు, పుంగనూరు, పలమనేరు చేర్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటి అద్దె సమానంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్‌ను పట్టించుకోలేదు.
     
    ఉద్యోగి 33 సంవత్సరాల సర్వీసును చేస్తే పూర్తి పెన్షన్ (ఆఖరు నెల జీతంలో సగం)కు అర్హత లభిస్తుంది. అయితే ప్రభుత్వం గతంలో ఇందుకు 5 సంవత్సరాల మినహాయింపు ఇచ్చింది. అంటే 28 సంవత్సరాలు సర్వీసు చేసిన ఉద్యోగులకూ పూర్తి పెన్షన్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ మినహాయింపును 8 సంవత్సరాలకు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది.  కేంద్రం 20 సంవత్సరాల సర్వీసు ఉన్న వారికి పూర్తి పెన్షన్‌కు అర్హత కల్పిస్తోంది. అదే విధంగా రాష్ట్రంలోనూ ఉండాలని ఉద్యోగులు కోరారు.
     
    ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని పీఆర్సీ సూచించింది. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ విధానం వర్తింప చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. వికలాంగ ఉద్యోగులకు కొంత మినహాయింపు ఇవ్వచ్చని సూచించింది.
     
    వివాహిత మహిళా ఉద్యోగులు ఒక్కో దఫా 180 రోజుల ప్రసూతి సెలవును (గరిష్టంగా ఇద్దరు పిల్లలకు) తీసుకోవచ్చు. దీన్ని 9 నెలలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కానీ పీఆర్సీ అంగీకరించలేదు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగినులకు  ప్రసూతి సెలవు ఇవ్వాలన్న డిమాండ్‌పై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
     
    మహిళా టీచర్లకు ఇస్తున్నట్లుగా ఏటా 5 రోజుల అదనపు సాధారణ సెలవు (సీఎల్స్)లను అన్ని శాఖల్లో ఉద్యోగినులకు ఇవ్వాలనే డిమాండ్‌ను పీఆర్సీ అంగీకరించలేదు.
     
    టీబీ, కుష్టు, కేన్సర్, మానసిక అనారోగ్యం, హృద్రోగం, మూత్రపిండాల సమస్యలకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు అసాధారణ సెలవు మంజూరు చేసినప్పుడు పరిహార భత్యం కూడా చెల్లించాలని సూచించింది.
     
    పరీక్షల నిర్వహణ పనులకు హాజరయ్యే అన్ని విభాగాల వైద్యులకు 15 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని సిఫారసు చేసింది. సదస్సులకు హాజరు కావడానికి మరో 5 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలంది.
     
    వికలాంగ ఉద్యోగుల అలవెన్సును రూ.900 నుంచి రూ.2,000కు పెంచాలి.
     
    వికలాంగ ఉద్యోగులు తమకు అవసరమైన కృత్రిమ అవయవాలు, పరికరాలు తెచ్చుకోవడానికి ఏటా 7 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలి.
     
    ఎంఈవో, ప్రధానోపాధ్యాయుల వేతన స్కేళ్లను సమానం చేయాలి.
     
    ఎల్టీసీని రూ. 18,750కు పెంచాలి.
     
    పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజును రూ. 1000 నుంచి రూ. 2,500కు పెంచాలి.
     
    రీడర్ అలవెన్స్‌ను ఎస్జీటీలకు రూ.1200లకు, స్కూల్ అసిస్టెంట్లకు రూ.1500లకు, లెక్చరర్లకు రూ. 2000కు పెంచాలి.
     
    స్పెషల్ పేను ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంకు రూ.125, ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎంకు రూ.150, ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్‌కు రూ. 100, ఉన్నత తరగతుల బోధనకు రూ. 150 ఇవ్వాలి.
     
    ఉద్యోగికి చెల్లించే కుటుంబ పెన్షన్‌కూ డీఆర్ చెల్లించాలి.
     
    కమ్యుటేషన్ పెన్షన్ తిరిగి చెల్లించే కాల వ్యవధి యథావిధిగా కొనసాగించాలి.
     
    సంఘాల వారీగా కాదు.. జేఏసీతో చర్చలు జరపాలి

    పీఆర్సీ పాక్షిక నివేదిక ఇచ్చి చర్చలకు రమ్మనడంలో అర్ధం లేదని, పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతే చర్చల్లో పాల్గొంటామని మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ సంఘాల జేఏసీ తేల్చి చెప్పింది. సంఘాల వారీగా కాకుండా జేఏసీతో చర్చించాలని కోరింది. జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయింది. అంతకు ముందు జేఏసీ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన యనమల.. నివేదికను ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని చెప్పారు. 12వ తేదీ వరకు తనతో పాటు ఉపసంఘంలోని మంత్రులు బిజీగా ఉంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో 13న చర్చలకు రావడానికి జేఏసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. జేఏసీ ప్రతినిధి బృందంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు(రెవెన్యూ సంఘం), కత్తి నరసింహారెడ్డి(ఎస్టీయూ), ఐ.వెంకటేశ్వరరావు(యూటీఎఫ్), చంద్రశేఖరరెడ్డి(ఏపీఎన్జీవో), రఘురామిరెడ్డి (ఏపీటీఎఫ్), కమలాకరరావు(పీఆర్టీయూ), రవికుమార్(ట్రెజరీ ఉద్యోగుల సంఘం), మురళీకృష్ణ తదితరులున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement