కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం | Telangana reconstruction with congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం

Apr 29 2014 12:15 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యపడుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు.

 జహీరాబాద్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యపడుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని సుభాష్ గంజ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కూడా తమ పార్టీదేనన్నారు. అనుభవం ఉన్న పార్టీకి పట్టం కట్టడం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

 ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయా రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చి ఆ తర్వాత మాట మార్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ద్వారా సీమాంధ్రలో నష్టం జరిగిందన్నారు. అయినా సోనియాగాంధీ లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులతో వచ్చి సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామనని చెప్పిన కేసీఆర్ హైదరాబాద్‌కు రాగానే మాట మార్చారని విమర్శించారు. ఆయనను 1 సీఆర్, 2 సీఆర్ 3 సీఆర్ = కేసీఆర్‌గా అభివర్ణించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో తమ పార్టీలోనే ఉండేవారన్నారు. మామ ఎన్‌టీ రామారావు పార్టీ పెట్టిన అనంతరం పరిస్థితిని చూసి అక్కడకు వెళ్లాడని, ఆ తర్వాత మామ వద్ద నుంచి అధికారాన్ని చేజిక్కించుకుని ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో పొత్తు కూడా పెట్టుకున్నారన్నారు. ఇప్పుడు బీజేపీతో జతకట్టారని, మోడీ జపం చేస్తున్నారని విమర్శించారు. ఇక నరేంద్ర మోడి మోసం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ప్రపంచంలో అబద్దాలు చెప్పే వారిలో మోడీ నంబర్‌వన్ స్థానంలో ఉంటాడని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను 10 స్టార్ అని విమర్శించారు. ఆయన ఫాంహౌస్‌లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 తనిఖీల్లో లభ్యమైన నగదు :    రూ.3.29 కోట్లు
 అక్రమ మద్యం కేసులు :  1,177  
 ఓటర్లకు ప్రలోభాలు,  కోడ్ ఉల్లంఘన ఘటనలు : 116  
 అనుమతి లేని ప్రచారాలు,  ప్రదర్శనలపై కేసులు : 59

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement