కోటబొమ్మాళి, న్యూస్లైన్: కోరిన కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా ప్రసిద్ధి గాంచిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. మంగళ, బుధ, గురువారాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి.
కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రంగం సిద్ధం
Oct 7 2013 5:07 AM | Updated on Sep 2 2018 4:46 PM
కోటబొమ్మాళి, న్యూస్లైన్: కోరిన కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా ప్రసిద్ధి గాంచిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. మంగళ, బుధ, గురువారాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఆలయ ధర్మకర్తల మండలిని నియమించకపోవడంతో ఆలయ మేనేజర్ వాకచర్ల రాధాకృష్ణ అన్నీతానై ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఏటా భాద్రపద మాసంలో వచ్చే పోలాల అమావాస్య తర్వాత వచ్చే మంగళ, బుధ, గురువారాల్లో కొత్తమ్మతల్లి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. అమ్మవారిని కొలిచేందుకు రాష్ట్రం నలుమూలల నుంచేకాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు అఖండ దీపారాధనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జాతర మూడురోజులు పగటి వేషాలు, రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం జరిగే అమ్మవారి ఘటోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు. సంబరాలు జరిగే మూడు రోజులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాల సందర్భంగా 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సంగిడీ రాళ్ల పోటీలు, 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఉలవల బస్తాల పోటీలు నిర్వహించనున్నారు. సంగిడీ రాళ్ల పోటీల్లో ప్రథమస్థానం సాధించిన క్రీడాకారుడికి 2500 రూపాయల నగదు బహుమతి ఇస్తామని, మిగిలిన విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆలయ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించాలని గ్రామపెద్దలను కోరారు.
Advertisement


