
సచివాలయ ఉద్యోగ సంఘాల ఆగ్రహం
పీఆర్సీ(పే రివిజన్ కమిషన్) విషయంలో ఏపీ ప్రభుత్వం మెలికపెట్టడంపై సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్: పీఆర్సీ(పే రివిజన్ కమిషన్) విషయంలో ఏపీ ప్రభుత్వం మెలికపెట్టడంపై సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాస్టర్ స్కేల్లో మార్పుల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మాస్టర్ స్కేల్లో మార్పులు చేస్తే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల 50వేల మంది పెన్షనర్లపై ఆ ప్రభావం పడుతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆ సంఘాలు విమర్శించాయి. గత 9 పీఆర్సీలకు లేని విధానం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా పీఆర్సీ అమలు చేసిందో, ఏపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా చేయాలని ఈ సంఘాలు డిమాండ్ చేశాయి.