Sakshi News home page

రైల్వేస్టేషన్లను పరిశీలించిన డీఆర్‌ఎం

Published Tue, Jan 28 2014 1:38 AM

railway stations Observed DRM

భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ :వచ్చేనెల 6న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ జిల్లాలోని రైల్వేస్టేషన్లను తనిఖీ చేయనున్న నేపథ్యంలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) ప్రదీప్‌కుమార్ సోమవారం భీమవరం టౌన్, జంక్షన్, తణుకు రైల్వేస్టేషన్లను పరిశీలించారు. స్టేషన్లలోని ప్లాట్‌ఫారాలను, ఆరు బయట ప్రాంతాలను, రిజర్వేషన్, టికెట్ కౌంటర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. టౌన్ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫారంపై చేస్తున్న పనులను, లిఫ్ట్ వద్ద చేస్తున్న టైల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) భవనాన్ని ఆయన పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. భవనంలో చేయాల్సిన మార్పులను వివరించారు.
 
 ప్రయాణికుల కోసం అదనంగా నిర్మిస్తున్న కుళాయిలను త్వరితగతిన నిర్మించాలని చెప్పారు. స్టేషన్ ఆవరణలో బ్యూటిఫికేషన్ కోసం చేపట్టాల్సిన చర్యలను స్టేషన్ సూపరింటెండెంట్ గణపతిరాజుకు సూచించారు. పెండింగ్ మరమ్మతులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భీమవరం టౌన్ ైరైల్వేస్టేషన్‌లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచినందుకు డీఆర్‌ఎం ప్రదీప్‌కుమార్ స్టేషన్ సూపరింటెండెంట్ గణపతిరాజుకు రూ.3 వేలు రివార్డును అందించారు. భీమవరం డివిజన్‌లో రైల్వే ఆస్తులను పరిరక్షించడంలో కృషి చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్) సీఐ హులీనాయక్‌కు రూ.2 వేలు రివార్డును అందించారు. డీఆర్‌ఎం వెంట పలువురు అధికారులు ఉన్నారు.  
 

Advertisement
Advertisement