వీ వాంట్ లడ్డూస్..! | Sakshi
Sakshi News home page

వీ వాంట్ లడ్డూస్..!

Published Wed, Aug 24 2016 7:37 PM

వీ వాంట్ లడ్డూస్..!

-  శ్రీవారి లడ్డూల కోసం భక్తుల నిరసన
- అదనపు లడ్డూలు ఇవ్వాలని నినాదాలు
సాక్షి,తిరుమల:
తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం బుధవారం భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్‌లో భక్తుల రద్దీని బట్టి రూ.25 ధరతో రూ.50కి రెండు, రూ.100కి నాల్గు చొప్పన లడ్డూలు విక్రయిస్తారు. ఉదయం వేళ సుమారు 2 వేల లడ్డూలు మాత్రమే కేటాయించారు. తర్వాత కౌంటర్ మూసివేశారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము క్యూలో నిరీక్షిస్తున్నా లడ్డూలు ఇవ్వకుండా కౌంటర్ మూసివేయటం తగదంటూ ఆలయం వద్ద నినాదాలు చేశారు. ‘‘వీ వాంట్ లడ్డూస్..వీ వాంట్ లడ్డూస్’’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై వారిని వారించి పంపించేశారు. రోజూ 3 నుండి 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నా డిమాండ్ రెట్టింపు స్థాయిలో ఉండటమే లడ్డూల కొరతకు ప్రధాన కారణంగా ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అదనపు లడ్డూలు తయారు చేయటానికి ఆలయ పోటులో స్థలం సరిపోదని చెబుతున్నారు.
 
నేడు గోకులాష్టమి
తిరుమలలో శ్రీవారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో వైదికంగా ఈ ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు. 26వ తేదిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సమక్షంలో ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది.

Advertisement
 
Advertisement