శ్రీకాకుళం జిల్లాలో మానసిక రోగి వీరంగం | Mental patient breaks Goddess statue in Srikakulam District | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో మానసిక రోగి వీరంగం

Dec 20 2013 1:06 PM | Updated on Sep 2 2017 1:48 AM

శ్రీకాకుళం జిల్లా టెక్కటి మండలం కోటబొమ్మాళిలోని ప్రసిద్ధ కొత్తమ్మతల్లి అమ్మవారి ఆలయంలో గురువారం ఓ మానసిక రోగి వీరంగం సృష్టించాడు.

టెక్కలి : శ్రీకాకుళం జిల్లా టెక్కటి మండలం కోటబొమ్మాళిలోని ప్రసిద్ధ కొత్తమ్మతల్లి అమ్మవారి ఆలయంలో గురువారం ఓ మానసిక రోగి వీరంగం సృష్టించాడు. అమ్మవారి విగ్రహం చేతులను ధ్వంసం చేయటంతోపాటు పలువురిపై దాడి చేసి గాయపరిచాడు. వివరాలు.. సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన విశ్రాంత బీపీఎమ్ ఉదండరావు ప్రసాదరావు కుమారుడు రవికుమార్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం విశాఖపట్నం వెళ్లేందుకు తండ్రి ప్రసాదరావు అతడితో పాటు కోటబొమ్మాళి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే రైలు వెళ్లిపోవడంతో బస్సులో వెళ్లేందుకు ఊళ్లోకి వచ్చారు. ఈ సమయంలో పరారైన రవికుమార్ కొత్తమ్మతల్లి ఆలయానికి చేరుకుని భవానీస్వాములు అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని తినేశాడు.
 
 తర్వాత అమ్మవారి విగ్రహం ఎదురుగా నగ్నంగా నృత్యం చేయడంతో పూజారి కమ్మకట్ల సరోజని వారించటానికి యత్నించారు. దీంతో రవికుమార్ ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతులను ధ్వంసం చేశాడు. అక్కడే ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని కోళ్ల సూరి అనే యాచకునిపై దాడిచేసి గాయపరిచాడు. అడ్డుకునేందుకు యత్నించిన భవానీస్వామి కామిల్లి కొండలరావు చేయి విరగ్గొట్టాడు. అనంతరం ఎదురుగా ఉన్న చెట్టు, రాళ్లకు తల కొట్టుకుని గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు, అక్కడ నుంచి విశాఖపట్నం మానసిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement