మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు | mall practice commits criminal cases | Sakshi
Sakshi News home page

మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు

Feb 2 2014 3:35 AM | Updated on Oct 20 2018 6:17 PM

గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పరీక్షల్లో అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని జేసీ లక్ష్మీకాంతం హెచ్చరించారు.

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పరీక్షల్లో అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని జేసీ లక్ష్మీకాంతం హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం ఆయన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ అభ్యర్థులతో ఫోన్ ఇన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం జరిగే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు 37,960 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
 
 జిల్లా వ్యాప్తంగా నెల్లూరు, గూడూరు, కావలి డివిజన్లలో 94 కేంద్రాలలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 10 నుంచి 12గంటల వరకు వీఆర్‌ఓ, మధ్యాహ్నం 3 నుంచి 5గంటల వరకు వీఆర్‌ఏ పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయం దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనాలోనికి అనుమతించేది లేదని చెప్పారు. నిర్ణయించిన గడువుకు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలన్నారు. మాస్ కాపీ  అరికట్టేందుకు అభ్యర్థుల నుంచి వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
 
 హాల్ టికెట్లో ఫొటో లేకపోతే..
 అభ్యర్థులు హాల్ టికెట్‌లో ఫొటో లేక పోతే గెజిటెట్ ఆఫీసర్ చేత ధ్రువీకరణపత్రం కచ్చితంగా తేవాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నులను మాత్రమే వినియోగించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్‌లేటర్, వైట్‌నర్లు అనుమతించడం జరగదని చెప్పారు.
 
 రాంగ్ కోడింగ్ చేస్తే పేపర్ నాట్ వాల్యూడ్
 ప్రశ్నపత్రాల్లో రాంగ్ కోడింగ్, కోడింగ్ చేయకపోయినా పేపర్ నాట్ వాల్యూడ్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని జేసీ తెలిపారు. ప్రతి అభ్యర్థినీ వీడియో ద్వారా చిత్రీకరించనున్నట్లు చెప్పారు. మహిళా అభ్యర్థులను అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా పరిశీలించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని అభ్యర్థులకు సంబంధించిన వారు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రామిరెడ్డి, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఏపీపీఎస్‌ఈ సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement