కుందూ ఉధృతి | Sakshi
Sakshi News home page

కుందూ ఉధృతి

Published Wed, Sep 17 2014 2:36 AM

కుందూ ఉధృతి - Sakshi

పెద్దముడియం:
 కుందూనదిలో వరద ఉధృతి పెరుగుతోంది. సోమవారం ఉదయం కుందూ నదిలో 9వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా అదే రోజు రాత్రి కురిసిన వర్షాలకు  ప్రవాహం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రికి కుందూలో 13వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం. మండలంలోని నెమళ్లదిన్నె బ్రిడ్జిపై రెండు అడుగుల ఎత్తు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో కుందూ నదిలో ప్రవాహం మరింత పెరిగి నెమళ్లదిన్నె, గరిశలూరు గ్రామాల్లోని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. ప్రతి ఏడాది కుందూ నదికి వరదలు వస్తుండటంతో పరివాహక ప్రాంతాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.ప్రతి ఏడాది కుందూ నదికి వరదలు వస్తుండటంతో పంటపొలాలు, ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. ప్రజల కష్టాలను గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రాజోలి ఆనకట్టవద్ద 2.93 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ వైఎస్ మరణానంతరం వచ్చిన పాలకులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వరద జలాలన్నీ పూర్తిగా నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే పెద్దముడియం, రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల్లోని రైతుల పంటలకు సాగునీరు, తాగునీరు అందే ఆవకాశం ఉంది. 
 
 

 

Advertisement
Advertisement