గ్రామ స్వరాజ్యం ఆరంభం
స్వాతంత్య్ర దినోత్సవాన వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం
విజయవాడలో ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
అర్హులందరికీ సంక్షేమం అందాలన్నదే లక్ష్యం
గుంటూరులో సీఎం సందేశాన్ని వీక్షించిన వలంటీర్లు
సాక్షి, గుంటూరు: స్థానిక స్వపరిపాలనలో నవశకానికి నాంది వార్డు వలంటీర్ వ్యవస్థ అని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. గుంటూరు నగరంలో ఎంపికైన వార్డు వలంటీర్ల కోసం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా సీఎం ప్రసంగాన్ని వినిపించారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి వార్డు సచివాలయాలు ప్రారంభమవుతాయని, గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం పాలన సాగిస్తున్నారని తెలిపారు. వలంటీర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నగర పాలక సంస్థలో 4,165 వార్డు వలంటీర్లకుగాను 3,632 మందిని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. వీరికి 2 విడతలుగా శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఉపా సెల్ సీవో శివన్నారాయణ, రెవెన్యూ అధికారులు ఎస్ఎన్ ప్రసాద్, పర్వతం నర్సిరెడ్డి, ఏఈ పవన్కుమార్ పాల్గొన్నారు.