జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సోమవారం పర్యటించనున్నారు.
నేడు జిల్లాకు చంద్రబాబు రాక
Nov 25 2013 2:35 AM | Updated on Aug 10 2018 7:58 PM
సాక్షి, కాకినాడ : జిల్లాలోని హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సోమవారం పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఉదయం 9.30 గంటలకు మధురపూడి చేరుకునే చంద్రబాబు అక్కడ నుంచి లాలాచెరువు, వేమగిరి, జొన్నాడ సెంటర్, రావులపాలెం, కొత్తపేటల మీదుగా రాకుర్తివారిపాలెం చేరుకుంటారు. అక్కడ
తుపాను తాకిడికి నేలకొరిగిన అరటితోటలను పరిశీలిస్తారు. అనంతరం అంబాజీపేట, అమలాపురం బైపాస్, ముమ్మిడివరం మీదుగా గున్నేపల్లి చేరుకొని దెబ్బ తిన్న పంటపొలాలను చూస్తారు.
అక్కడ నుంచి కాట్రేనికోన మండలం పల్లం వెళ్లి తుపాను సమయంలో సముద్రంలో చిక్కుకొని క్షేమంగా తీరానికి చేరుకున్న మత్స్య కారులను పరామర్శిస్తారు. అనంతరం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నేల కొరిగిన కొబ్బరితోటలను, అమలాపురం రూరల్ మండలం చిందాడగరువులో పంటపొలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి అమలాపురంలో పర్యటించి కోనసీమ నేతలతో మాట్లాడి తుపాను నష్టాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం బండార్లంక వీవర్స్ కాలనీలో పర్యటించి మగ్గాల్లో నీరు చేరి, ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులతో మాట్లాడతారు.
అక్కడ నుంచి అంబాజీపేట, పి.గన్నవరంల మీదుగా తాటిపాక సెంటర్ చేరుకుని పి.గన్నవరం, రాజోలు ప్రాంత రైతులతో సమావేశమై వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటారు. హెలెన్ ధాటికి కకావికలమైన కోనసీమ దుస్థితికి అద్దం పట్టే విధంగా పార్టీ నేతలు ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. అనంతరం దిండి రిసార్ట్స్ చేరుకొని రాత్రికి బస చేస్తారు. మంగళవారం ఉదయం దిండి రిసార్ట్స్నుంచి బయల్దేరి చించినాడ వంతెన మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తారు. హెలెన్ బాధిత రైతులు, ప్రజలకు అండగా నిలిచేందుకు వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని, ఆయన వెంట వేలాదిగా పార్టీ కార్యకర్తలు పాల్గొని బాధితులకు సంఘీభావం తెలపాలని రాజప్ప పిలుపు నిచ్చారు. కాగా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చినరాజప్ప ఏర్పాట్లపై సమీక్షించి
Advertisement
Advertisement