భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కండి


 ‘గీతం’ విద్యార్థులకు ఎంవీవీఎస్ మూర్తి పిలుపు

 సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగం కోసం ఏ దేశానికి వెళ్లినా అక్కడి టెక్నాలజీని ఆకళింపుజేసుకొని సొంతగడ్డకు తీసుకురావాలని, ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గీతం వర్సిటీ విద్యార్థులకు సంస్థ చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి పిలుపునిచ్చారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 2,527 మంది గీతం విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ఆయా సంస్థల తరపున నియామకపత్రాలు అందజేశారు. మంగళవారం గీతం వర్సిటీలో నిర్వహించిన ఎచీవర్స్ డే ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ  సెబీ ఆదేశాల ప్రకారం ప్రతి కంపెనీ డెరైక్టర్లలో మూడో వంతు మహిళలను నియమించాల్సి ఉందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.


ప్రతి ఒక్కరూ ఒక సరికొత్త ఆలోచనతో బిజినెస్ లీడర్లు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గీతం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ జి.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు, ప్రొ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ డి.హరినారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు, ప్లేస్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఎచీవ్‌మెంట్ సాధించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరుకావడంతో వేదిక స్నాతకోత్సవాన్ని తలపించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top