ఇప్పటివరకు 129.. ఇక 68 | AP Government That Reduced The Bars | Sakshi
Sakshi News home page

ఇప్పటివరకు 129.. ఇక 68

Nov 30 2019 8:16 AM | Updated on Nov 30 2019 8:16 AM

AP Government That Reduced The Bars - Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): మద్యం నిషేధం దశల వారీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే విక్రయాలతో పాటు  టైమింగ్స్‌ కూడా తగ్గించింది. ఇక బార్లకు కూడా కళ్లెం వేయనుంది. నూతన బార్‌ పాలసీలో 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభు త్వం 40 శాతం బార్లు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించడంతో జిల్లా ఎ క్సైజ్‌ అధికారులు ఇప్పటికే ఆ ప్రకియ ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఉంచాల్లో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్ధమయ్యారు.

డిసెంబర్‌తో లైసెన్స్‌లు పూర్తి.. 
ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్సులు డిసెంబర్‌ 31తో రద్దు అవుతాయి. వాస్తవానికి ప్రస్తుత బార్ల లైసెన్సులు 2020 జూన్‌ ఆఖరి వరకు ఉన్నాయి. మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన రోజులకు సంబంధించి లైసెన్స్‌ ఫీజును ప్రభుత్వం బార్‌ యజమానులకు తిరిగి చెల్లిస్తుంది.

ఇక 68 బార్లే.. 
ప్రస్తుతం జిల్లాలో 129 బార్లు ఉన్నా యి. ప్రభుత్వం 40 శాతం తగ్గించాలని ఆదేశాలు జారీ చేయడంతో 68 బార్లు మాత్రమే జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి విశాఖ నగర పరి«ధి(జీవీఎంసీ)లో 66 ,యలమంచలి,నర్సీపట్నం మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు కానున్నాయి. ఫీజుల పెంపు  మరో వైపు 2020 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న బార్ల లైసెన్స్‌ ఫీజులు ప్రభుత్వం పెంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలో బార్‌ ఏర్పాటు చేయాలంటే రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీలో రూ.50 లక్షలు, 5 లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న మున్సిపాలిటీ/నగర పాలక సంస్థలో బార్‌ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలు లైసెన్స్‌ ఫీజులు చెల్లించాలి. ఈ ప్రాతిపదికన విశాఖ నగర పరిధిలో బార్‌ ఏర్పాటు చేయాలంటే రూ.75 లక్షలుగా నిర్ణయించారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. 
బార్‌ లైసెన్స్‌ల కోసం ఆసక్తి  ఉన్న వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేయాల్సి వుంది. ఎక్సైజ్‌ శాఖ వెబ్‌సైట్‌ ద్వారా డిసెంబర్‌ 6లోగా (మధ్యాహ్నం మూడు గంటలు) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంది. 7న డ్రా తీస్తారు. అలాగే ఒక కాపీని ఎక్సైజ్‌ కార్యాలయంలో అందజేయాలి. అన్ని డాక్యుమెంట్లు,బార్‌ నడిపే ఇంటి యజమాని నుంచి లేఖ, ఇతర డాక్యుమెంట్లు తప్పని సరిగా సమర్పించాలి. 

మార్గదర్శకాలు రాగానే.. 
నూతన మద్యం పాలసీలో భాగంగా బార్ల తగ్గింపుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిపై శుక్రవారం రాజపత్రం కూడ ప్రభుత్వం విడుదల చేసింది.  ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. ఏడాది పాటు బార్లు నడపడానికి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయాలి. బార్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయాలనుకున్న వారు రూ.10 లక్షల డీడీ సమర్పించాలి. బార్లు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తాం. 
-టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం. 

Advertisement
 
Advertisement
Advertisement