
బార్లపై ఏఆర్ఈటీ తొలగింపునకు కూటమి సర్కారు సిద్ధం
మంత్రి వర్గం ఉప సంఘం ద్వారా కథ నడుపుతున్న ప్రభుత్వ పెద్దలు
సానుకూలంగా సిఫారసుకు ఇప్పటికే నిర్ణయం
కేబినెట్లో మమ అనిపించి దోపిడీకి పచ్చ జెండా ఊపనున్న వైనం
మద్యం ధరలపై నియంత్రణ లేకుండా చేసి అడ్డగోలు ప్రయోజనం
నాలుగేళ్లలో రూ.4 వేల కోట్ల దోపిడీకి స్కెచ్
బార్లలోనూ చీప్ లిక్కర్ విక్రయాలకు సానుకూలం
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2014–19లో ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి, అడ్డగోలు దోపిడీకి సహకరించిన నాటి టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుతం అదే తరహాలో వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును (ఏఆర్ఈటీ) దొడ్డి దారిలో తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ.. మరోవైపు సిండికేట్ దోపిడీకి వత్తాసు పలికే ఈ పన్నాగానికి మంత్రివర్గ ఉప సంఘం ద్వారా రాజ ముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో టీడీపీ మద్యం సిండికేట్ ఆడిందే ఆటగా సాగుతోంది.
అందుకోసం బార్ల టెండర్ల ప్రక్రియను హైజాక్ చేసింది. ప్రభుత్వ పెద్దల పన్నాగంతోనే రాష్ట్రంలో 840 బార్లకు ఉద్దేశ పూర్వకంగా టెండర్లు దాఖలు చేయకుండా డ్రామా నడిపింది. రెండు దశల నోటిఫికేషన్ తర్వాత కూడా 540 బార్లకే లైసెన్సులు ఖరారు చేసి, మరో 300 బార్ల లైసెన్స్ ప్రక్రియ పెండింగ్లో ఉండేట్టు చేసింది. తద్వారా బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకు ఎవరూ సుముఖంగా లేరనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించింది. అదే తడవుగా టీడీపీ సిండికేట్ తమ అడ్డగోలు దోపిడీకి డిమాండ్లను తెరపైకి తెచి్చంది. బార్లకు సరఫరా చేసే మద్యం ధరలపై ఏఆర్ఈటీ తొలగించాన్నది వాటిలో ప్రధాన డిమాండ్.
మంత్రి మండలి సమావేశంలోనే తుది నిర్ణయం
⇒ రాష్ట్రంలో బార్లకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదని నమ్మించేందుకు సిండికేట్తో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపించింది. ఎవరూ ముందుకు రావట్లేదన్న సాకుతో బార్ల యజమానులకు మరిన్ని వెసులుబాటులు కలి్పంచాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది.
⇒ బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతం 15 శాతం ఏఆర్ఈటీ విధిస్తున్నారు. ఎందుకంటే బార్లలో ఎంఆర్పీకే మద్యం విక్రయించాలన్న నిబంధన లేదు. బార్లు ఇష్టానుసారం రేట్లకు విక్రయిస్తాయి. అందుకే 15 శాతం ఏఆర్ఈటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల ఆదాయం వస్తోంది. కాగా ప్రస్తుతం టీడీపీ సిండికేట్కు అడ్డగోలు ప్రయోజనం కలిగించేందుకు ఆ 15 శాతం ఏఆర్ఈటీని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.
⇒ అదే ప్రధాన అంశంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ విధానంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. సోమవారం సమావేశమైన ఈ మంత్రివర్గ ఉప సంఘం మద్యం దుకాణాలపై సర్దుబాటు ముసుగుతో బార్లపై ఏఆర్ఈటీని తొలగించే విధంగా సిఫార్సు చేయాలని భావిస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఏఆర్ఈటీ తొలగింపుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
⇒ కాగా, ఏఆర్ఈటీ తొలగిస్తే ఖజానాకు ఏటా రూ.500 కోట్లు గండి పడుతుంది. రానున్న నాలుగేళ్లలో టీడీపీ మద్యం సిండికేట్కు రూ.2 వేల కోట్లు అడ్డగోలుగా ప్రయోజనం కలగనుందన్నది స్పష్టం అవుతోంది.
⇒ అంతేకాకుండా బార్లలోనూ చీప్ లిక్కర్ అమ్మకాలకు పచ్చ జెండా ఊపే విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్ వాటా 30 శాతంగా ఉంది. నెలకు సగటున రూ.3 వేల కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటే అందులో రూ.900 కోట్లు మేర చీప్ లిక్కర్ ద్వారానే వస్తోంది. చీప్ లిక్కర్ అమ్మకాలు మరింత పెంచడం ద్వారా సిండికేట్ అడ్డగోలు దోపిడీకి మరింత సహకరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది.
మద్యం ధరలపై నియంత్రణ మాత్రం లేదు
బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ తొలగింపు దిశగా సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ బార్లలో మద్యం ధరలపై మాత్రం ఎటువంటి నియంత్రణ విధించాలని భావించడం లేదు. ఉదాహరణకు రూ.100 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్పై 15 శాతం ఏఆర్ఈటీ విధించి బార్లకు ప్రస్తుతం రూ.115తో విక్రయిస్తున్నారు. బార్లు కనీసం రూ.130కి పైగానే విక్రయిస్తున్నాయి. ఏఆర్ఈటీ 15 శాతం తొలగించాక ఆ బాటిల్ను ఎంతకు విక్రయించాలనేది ప్రభుత్వం నిర్దేశించడం లేదు.
అంటే బార్లు ఇప్పటి వరకు విక్రయిస్తున్న రీతిలోనే రూ.130 కంటే ఎక్కువగానే విక్రయించవచ్చు. ఈ లెక్కన ఒక్కో బాటిల్పై ఖజానాకు రూ.15 నష్టం.. టీడీపీ సిండికేట్కు రూ.30 లాభం. ప్రస్తుత అమ్మకాల పరిణామం ప్రకారం.. టీడీపీ సిండికేట్ ఏటా రూ.500 కోట్ల చొప్పున రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు కొల్లగొట్టనుంది. ఆ ప్రకారం ఏఆర్ఈటీ తొలగింపుతో రూ.2 వేల కోట్లు, ఎంఆర్పీ కంటే అధిక ధరలతో రూ.2 వేల కోట్లు వెరసి.. రానున్న నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు దోపిడీకి పాల్పడుతుందన్నది స్పష్టమవుతోంది.